ప్రభుత్వ రంగ సంస్థల వల్లే ఉపాధి
ABN , First Publish Date - 2021-06-23T05:18:06+05:30 IST
నగరంలోని లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి పొందడానికి కారణం నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలేనని సీఐటీయూ గాజువాక ఆటోనగర్ జోన్ అధ్యక్షుడు ఎం.రంగబాబు అన్నారు.
సీఐటీయూ నాయకుడు రంగబాబు
సిరిపురం, జూన్ 22: నగరంలోని లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి పొందడానికి కారణం నగరంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలేనని సీఐటీయూ గాజువాక ఆటోనగర్ జోన్ అధ్యక్షుడు ఎం.రంగబాబు అన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణను కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విశాఖ కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 82వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఏర్పడిందన్నారు. ఇందులో 32 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, పరోక్షంగా వేలాది మంది ఉపాధి పొందుతున్నారన్నారు. దీనికి అనుబంధంగా ఏర్పడ్డ చిన్నచిన్న పరిశ్రమలలలో ఎంతోమంది అసంఘటిత రంగ కార్మికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ కార్యదర్శి బి.రమణ, నాయకులు జి.చిరంజీవి, బి.బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.