ఉపాధి హామీ కూలీలు రోజుకు రూ.230 పొందాలి
ABN , First Publish Date - 2021-03-05T05:44:20+05:30 IST
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు రోజుకు రూ.230ల కూలి డబ్బులు వచ్చేవిధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
మోపాల్, మార్చి 4: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు రోజుకు రూ.230ల కూలి డబ్బులు వచ్చేవిధంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. గురువారం మోపాల్ మండల కేంద్రంలోని ఊర చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను కలెక్టర్ పరిశీలించారు. అక్కడ పనిచేస్తున్న కూలీలతో ఆయన మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజు కూలి ఎంత వస్తుందని ఆరా తీశారు. ఉపాధి కూలీ లు రోజుకు రూ.230లు వచ్చే విధంగా చూసుకోవాలన్నారు. అందుకు తగ్గట్టుగా పనిచేసినప్పుడే డబ్బులు వస్తాయన్నారు. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో తొందరగా పనికి వచ్చి పనులు పూర్తిచేసుకోవాలని అన్నారు. ఒక్కో కూలీకి రూ.150 నుంచి రూ.180 పడితే తక్కువ పనిచేస్తున్నట్లుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ చూపించిన విధంగా పనిచేస్తే ప్రతీ ఉపాధి కూలీకి రూ.230 వస్తాయన్నారు. పని దినాలు ఎప్పటికీ ఉంటాయని, ఎంతమందికి ఉపాధి కావాలన్నా తాము కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ నర్సింగ్పల్లి, ముదక్పల్లి గ్రామాలలో ఉన్న పల్లె ప్రగతి నర్సరీలను పరిశీలించారు. కలెక్టర్ వెంట పీడీ శ్రీనివాస్, ఎంపీడీవో సంజీవ్కుమార్, మండల అధికారులు ఉన్నారు.