ఉద్యోగులు, ఉపాధ్యాయుల నిరసన
ABN , First Publish Date - 2021-12-08T04:38:14+05:30 IST
స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు.
సూళ్లూరుపేట, డిసెంబరు 7 : స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈనెల 10 వరకు ఇలాగే నిరసన తెలుపుతామని, తదుపరి జిల్లా కేంద్రంలో ఆందోళన చేస్తామని స్థానిక ఎన్జీవో సంఘం అధ్యక్షుడు ఎస్. జనార్దనయ్య వెల్లడించారు. పెండింగ్ డీఏలను, వేతన సవరణలను పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్జీవో సంఘం నేతలు రవికుమార్, కమలకుమారి, వరలక్ష్మి, మోహన్రావు, నసిమునిసాబేగం, గిరిబాబు పాల్గొన్నారు
నాయుడుపేట: పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచాలని కోరుతూ రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో భోజన విరామ సమయంలో స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు పీఆర్సీ అమలు చేయాలని భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
ఓజిలి : మండలంలోని రెవెన్యూ, మండల పరిషత్, ఇతర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, అన్ని పాఠశాలలు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. తహసీల్దారు లాజరస్ తన సిబ్బందితో కలిసి నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈనెల 10 వరకు ఇలాంటి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.
సంగం : ఏపీ జేఏసీ ఐక్యవేదిక పిలుపు మేరకు స్థానిక ప్రాథమిక వైద్యశాల పరిధిలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యశాల ఎదుట నిరసన తెలిపారు. తమ దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఏ ఎస్ పేట : మండలంలోని వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దారు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు నల్లబ్యాడ్జీలు ధరించి మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు తెలిపి ర్యాలీలు చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు లక్ష్మీనరసింహా, ఆర్ఐ పృథ్విరాజ్, వీఆర్వో హజరత్తయ్య, వీఆర్ఏలు పాల్గొన్నారు.
చేజర్ల : తహసీల్దారు శ్యామసుందరరాజ, డీటీ విజయ్, మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.