సేద్యంపై ఇంధన భారం
ABN , First Publish Date - 2021-06-21T05:35:46+05:30 IST
రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు.
- యాంత్రీకరణ పెరడగంతో అన్నిటికీ రెట్టింపు ఖర్చు
- పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతున్న రైతులు
ఆళ్లగడ్డ, జూన్ 20: రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. దుక్కి దున్నడం నుంచి పంటల నూర్పిడి దాకా ప్రతి పనికి యంత్రాలు వాడుతు న్నారు. ప్రభుత్వాలు కూడా యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాయి. అయితే ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని వల్ల యంత్రాల బాడుగ అధికమైంది. యంత్రాలకు బదులు కూలీలను పిలుద్దామన్నా వారి రాకపోకల ప్రయాణ ఖర్చులు అధికమయ్యాయి. పెరిగిన ఇంధన ధరలు వ్యవసాయం మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఆళ్లగడ్డ వ్యవసాయ సబ్ డివిజన్లోని ఐదు మండలాల్లో 33,298 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. మొక్కజొన్న 1,880, కొర్ర 28, కంది 1,084, పెసలు 858, మినుములు 3,886, పత్తి 1,874, మిరప 1,368 హెక్టార్లలో సాగు చేయనున్నారు. వ్యవసాయ సబ్ డివిజన్లో 90 వేల మంది రైతులున్నారు. అం దరూ ఈ భారం మోయాల్సి వస్తోంది.
కూలీల ఖర్చులు పెరిగాయి
ప్రభుత్వం ఇంధన ధరలను పెంచడం దారుణం. దీని వల్ల వ్యవసా యం, దాని అనుబంధ రంగాలకు భారంగా మారింది. గతంలో ఇచ్చే కూలి కంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తోంది. మండల కేంద్రాల నుంచి ఎరువులు, ఇతర సామగ్రి తెచ్చుకోవడం గతంతో పోలిస్తే ఎక్కువ బాడుగు చెల్లించాల్సి వస్తోంది.
- వెంకటేశ్వర్లు, కోటకందుకూరు
సేద్యంలో ఇబ్బందులు
వ్యవసాయంలో ప్రతి పని యంత్రంతో ముడిపడి ఉంది. ట్రాక్టరుతో దుక్కి దున్నటానికి ఇంతకు ముందు ఎకరాకు రూ. 600 వరకు తీసుకునే వారు. డిజిల్ ధరలు అమాంతంగా పెరిగి పోవడంతో రూ. 1000 ఇవ్వాలి వస్తోంది. ఇక విత్తు నాటడం, పంటలు కొయడం, నూర్పిడి లాంటి పనులకు చాలా ఆదనంగా ఖర్చు వస్తోంది.
- శ్రీనివాసులు, యాదవాడ