భారతీయ అమెరికన్లనే కమల దూరం పెట్టారు: ఎరిక్ ట్రంప్

ABN , First Publish Date - 2020-09-19T21:09:51+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

భారతీయ అమెరికన్లనే కమల దూరం పెట్టారు: ఎరిక్ ట్రంప్

వాషింగ్టన్ డీసీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఈ  అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన భారతీయ అమెరికన్లను ఆకట్టుకునేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక ట్రంప్ శిబిరం ఎన్నారై ఓటర్లను ఆకర్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ఎరిక్ ట్రంప్ తండ్రి తరఫున ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అట్లాంటాలో జరిగిన ‘ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్’ కార్యక్రమంలో పాల్గొన్న ఎరిక్... ప్రత్యర్థి డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి సెనెటర్ కమలా హారిస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కమల స్వయంగా భారత సంతతికి చెందినవారైనప్పటికీ ఇండో-అమెరికన్లను పూర్తిగా దూరంగా ఉంచారని దుయ్యబట్టారు. 


ఈ కార్యక్రమంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడిన ఎరిక్... "కమలాను చూడండి. ఆమె స్వయంగా భారత సంతతికి చెందినవారు. కానీ, భారతీయ అమెరికన్లనే దూరం పెట్టారు. భారత వారసత్వం గురించి గొప్పగా చెప్పుకోవడం తప్పితే.. ఆమె చేసిందేమి లేదు. కమల చెప్పే మాటలకు.. చేసే పనులకు ఎలాంటి పొంతన ఉండదు." అని ఎరిక్ విమర్శించారు. కనుక ఈసారి కూడా ఎన్నారైలు తన తండ్రి డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ఇచ్చి మరోసారి అధ్యక్షుడిగా గెలిపించాలని కోరారు. భారతీయ అమెరికన్లను ట్రంప్ ఎప్పుడూ నిరాశపర్చరని తెలిపారు. అద్భుతమైన భారత సమాజాన్ని ట్రంప్ కుటుంబం ఎప్పుడూ ప్రేమిస్తుందన్నారు. చైనా, పాకిస్థాన్‌ల విషయంలో తన తండ్రి అనుసరించిన విధానాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివిధ సందర్భాల్లో భారత్‌కు ట్రంప్ మద్దతు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక నవంబర్ 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బిడెన్ బరిలో ఉంటే... రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-09-19T21:09:51+05:30 IST