కంగారొద్దు.. సమృద్ధిగా సరుకులు
ABN , First Publish Date - 2020-03-27T10:05:46+05:30 IST
నిత్యావసర సరుకుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జనం ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని కరోనా జిల్లా నోడల్ ఆఫీసర్, జేసీ-2 చంద్రమౌళి భరోసా ఇచ్చారు.
వీడియో కాన్ఫరెన్స్లో జేసీ-2 చంద్రమౌళి
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 26: నిత్యావసర సరుకుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జనం ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని కరోనా జిల్లా నోడల్ ఆఫీసర్, జేసీ-2 చంద్రమౌళి భరోసా ఇచ్చారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, స్పెషల్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలు సమీప హోల్సేల్, రీటైల్ దుకాణాల వద్ద ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనుగోలు చేసుకోవచ్చని గుంపులుగా చేరకుండా దూరం పాటించాలని సూచించారు. కరోనా నియంత్రణలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని ఆయన మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలను ఆదేశించారు. గ్రామ, మండల స్థాయి పరిధిలో ప్రతి 200 ఇళ్ళకో చోట రోజూ మధ్యాహ్నం 1 గంటకు మాక్ డ్రిల్ జరపాలని చెప్పారు. సమస్యలు ఎదురైతే స్థానిక ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డీపీవో కె. సాంబశివారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.