పోలవరం అంచనా వ్యయం 47,725.74 కోట్లు
ABN , First Publish Date - 2020-11-22T08:29:09+05:30 IST
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని
ఆర్సీసీ లెక్కలు పరిగణనలోకి తీసుకోవాలి
2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టు పూర్తి
41.15 మీటర్ల ఎత్తులో నీటి నిల్వ
దాని ప్రకారం భూసేకరణకు ప్రాధాన్యం
పీపీఏ అత్యవసర భేటీలో నిర్ణయాలు
అమరావతి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లుగా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందేనని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) అత్యవసర సమావేశం తీర్మానించింది. కేబినెట్ నిర్ణయం అమలు చేయాలని కేంద్ర జలశక్తి, ఆర్థికశాఖలు నిర్ణయించినప్పటికీ.... ఈ ఏడాది మార్చి 17న జలశక్తి శాఖ పరిధిలోని సవరించిన అంచనాల కమిటీ(ఆర్సీసీ) నిర్ధారించిన రూ.47,725.74 కోట్లు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పీపీఏ అత్యవసర సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మొత్తం నుంచి విద్యుత్కేంద్రానికి రూ.4,560.91కోట్లు, తాగునీటి పథకానికి రూ.7,214.67కోట్లు తీసేస్తే నికరంగా రూ.35,950.16 కోట్లు తేలుతుందని ఈ నెల 2న జరిగిన సమావేశంలో పీపీఏ పేర్కొంది. అందులో 2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన రూ.4,730.71 కోట్లు తీసేస్తే... రూ.31,219.45 కోట్లు లెక్క తేలుతుందని వెల్లడించింది.
ప్రాజెక్టులో 41.15మీటర్ల ఎత్తులో నీరు నిల్వ చేసేందుకు ప్రాధాన్యమిస్తూ భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖకు సూచించింది. 2022 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని పేర్కొంది. పోలవరం పనుల జోరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన పీపీఏ... డిజైన్ల ఆమోదంపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించింది. ఈ సందర్భంగా పోలవరం అంచనా వ్యయం పెరిగిన తీరును పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ వివరించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రమే భరించాలని, జలవిద్యుత్కేంద్రం నిర్మాణానికి, తాగునీటి పథకాలకూ నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ డిమాండ్ చేసినట్లు అయ్యర్ పేర్కొన్నారు.