హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఈటల రాజేందర్ సతీమణి?

ABN , First Publish Date - 2021-06-03T23:38:55+05:30 IST

రాష్ట్ర రాజకీయాల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ హాట్ టాఫిక్‌గా మారారు. ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

హుజూరాబాద్ ఉప ఎన్నిక బరిలో ఈటల రాజేందర్ సతీమణి?

హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ హాట్ టాఫిక్‌గా మారారు. ఆయన బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ నియమం ప్రకారం ఇతర పార్టీల నుంచే వచ్చే వారు తమ పార్టీకి పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీజేపీలో చేరాలనే కండీషన్ ఉంది. ఇదే విషయాన్ని ఆ పార్టీ నేతలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటల ఎమ్మెల్యే పదవికి టీఆర్‌ఎస్ రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నికపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఈ ఉప ఎన్నికలో ఈటల పోటీకి దిగడం లేదనే ప్రచారం సాగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో తన సతీమణి జమునను పోటీలో నిలిపే యోచనలో ఈటల ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 


ఈటల తన శాసనసభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేసి తన రాజకీయ భవితవ్యాన్ని తేల్చుకోవాలని భావించి అందుకు సిద్ధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈటల బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగితే టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నా దుబ్బాక ఉప ఎన్నిక మాదిరిగా టీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య నువ్వా..నేనా అన్నట్లు పోటీ జరిగే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈ ఉప ఎన్నికల్లో గెలువడం, టీఆర్‌ఎస్‌కు ప్రతిష్టాత్మకం. ఈటల రాజేందర్‌కు కూడా ఈ ఎన్నిక రాజకీయంగా చావోరేవో తేల్చేదిగా ఉంటుంది. దీంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశముందని రాజకీయ పండితులు చెబుతున్నారు. బీజేపీకి హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కమిటీలు, కార్యకర్తలు ఉన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఆ పార్టీ కమిటీలు ఉన్నాయి. జిల్లాశాఖ అధ్యక్షుడు కూడా హుజూరాబాద్‌కు చెందిన వారు కావడంతో అక్కడ పార్టీ కొంత బలోపేతమై ఉన్నది.


బీజేపీ, ఈటల ఇద్దరి ఎదుర్కొనేందుకు బలమైన అభ్యర్థిని దింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. వీరిలో ప్రముఖంగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మికాంతరావు, బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇటీవల నియోజకవర్గంలో వరస మీటింగ్‌లో టీఆర్‌ఎస్ క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఈటల రాజేందర్‌కు ప్రజల్లో కొంత సానుభూతి ఉన్నా దానిని ఆయన ఓటు రూపంలో పొందకుండా చూసేందుకు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఇప్పటికే వ్యూహాలు రచించింది. ఎంపీటీసీ, సర్పంచు, ఎంపీపీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ కౌన్సిలర్లు, చైర్మన్లు, మార్కెట్‌ కమిటీల చైర్మన్లు, సింగిల్‌ విండో చైర్మన్లను కూడగడుతూ ఆయన వైపు ఎవరూ వెళ్లకుండా కట్టడి చేస్తున్నది.

Updated Date - 2021-06-03T23:38:55+05:30 IST