ఈవీల తయారీ అంత ఈజీ కాదు
ABN , First Publish Date - 2021-05-04T06:36:08+05:30 IST
విద్యుత్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించాలన్న స్మార్ట్ఫోన్ కంపెనీల ప్రయత్నాలపై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సుతిమెత్తని విమర్శలు చేశారు...
- టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్
వాషింగ్టన్: విద్యుత్ కార్ల తయారీ రంగంలోకి ప్రవేశించాలన్న స్మార్ట్ఫోన్ కంపెనీల ప్రయత్నాలపై టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సుతిమెత్తని విమర్శలు చేశారు. ‘నమూనాలు ప్రదర్శించడం పెద్ద కష్టమేం కాదు. ఉత్పత్తే కష్టమైన పని’ అని ట్వీట్ చేశారు. యాపిల్, షామీ, ఎల్జీ, సోనీ, హువే కంపెనీలు విద్యుత్ వాహనాల (ఈవీ) తయారీకి సిద్ధమవుతున్నట్టు ఒక అభిమాని చేసిన ట్వీట్కు సమాధానంగా మాస్క్ ఈ ట్వీట్ చేశారు. వెంటనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోనీ కంపెనీ గత ఏడాది తన ‘విజన్-ఎస్’ విద్యుత్ కారును ప్రదర్శించింది. ఐఫోన్లు, మాక్బుక్స్తో టెక్ ప్రపంచాన్ని ఏలుతున్న యాపిల్ కంపెనీ 2025కల్లా తన విద్యుత్ కారును మార్కెట్లోకి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఉంది. చైనా టెక్ దిగ్గజం హువే ఇటీవల జరిగిన షాంఘై ఆటో ఎక్స్పోలో తన ఎస్యూవీ ఎస్ఎఫ్5 ప్రొటోటై్పని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో టెస్లా చీఫ్ ఈ ట్వీట్ చేయడం విశేషం.