విమానంలో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు

ABN , First Publish Date - 2021-08-22T16:56:25+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో క్షణక్షణం భయం భయంగా గడిపినవారు

విమానంలో ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో క్షణక్షణం భయం భయంగా గడిపినవారు భారత గడ్డపై అడుగు పెట్టగానే చాలా సంతోషంతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేశారు. దాదాపు 90 మంది ప్రయాణికులతో కాబూల్ విమానాశ్రయంలో బయల్దేరిన విమానం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే అందరూ ఆనందంతో ‘భారత్ మాతా కీ జై’ అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఆదివారం ఓ ట్వీట్‌లో తెలిపారు. 


కాబూల్ నుంచి 87 మంది భారతీయులను తజకిస్థాన్‌కు తరలించి, అక్కడి నుంచి న్యూఢిల్లీకి తీసుకొస్తున్నట్లు అంతకుముందు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఓ ట్వీట్‌లో తెలిపారు. వీరితోపాటు ఇద్దరు నేపాలీలను కూడా తీసుకొస్తున్నట్లు తెలిపారు. కాబూల్ నుంచి భారత వాయు సేన విమానంలో వీరిని తీసుకొస్తున్నట్లు పేర్కొన్నారు. తజకిస్థాన్‌లోని దుషాంబేలో ఉన్న భారత దౌత్య కార్యాలయం సహకారంతో మరిన్ని విమానాలను నడుపుతామని చెప్పారు. 


ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, ఆఫ్ఘనిస్థాన్‌లో చిక్కుకున్న భారతీయులను తీసుకెళ్ళేందుకు రోజుకు రెండు విమానాల చొప్పున నడిపేందుకు నాటో దళాలు అనుమతి ఇచ్చాయి. హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రస్తుతం నాటో దళాలు నిర్వహిస్తున్నాయి. 


Updated Date - 2021-08-22T16:56:25+05:30 IST