బతికే ఉన్నా సారూ.. పింఛనివ్వండి

ABN , First Publish Date - 2022-01-27T06:05:37+05:30 IST

అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని చనిపోయిన వారి జాబితాలోకి చేర్చింది.

బతికే ఉన్నా సారూ.. పింఛనివ్వండి
ఇంటి వద్ద నడవలేని స్థితిలో వృద్ధురాలు

అధికారులకు ఓ వృద్ధురాలి వినతి

శివ్వంపేట, జనవరి 26: అధికారుల నిర్లక్ష్యం ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలిని చనిపోయిన వారి జాబితాలోకి చేర్చింది. దీంతో తనకు ఆధారంగా ఉన్న వృద్ధాప్య పింఛను నిలిచిపోయింది. చివరికి, నేను బతికే ఉన్నా సారూ పింఛను ఇచ్చి ఆదుకోండి  అంటూ అధికారులను వేడుకుంటున్నది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శభా్‌షపల్లి గ్రామానికి చెందిన బుడిగె శివమ్మకు 78 ఏళ్లు ఉంటాయి. శివమ్మ భర్త 2017లో చనిపోయారు. అప్పట్నించి ఆమెకు వృద్ధాప్య పింఛన్‌ వస్తుండగా ఆ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నది. అయితే, ఏడాదిగా ఆ పింఛను ఆగిపోవడంతో ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. పింఛను కోసం అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయింది. ఇటీవల ఆరోగ్యం క్షీణించి నడవలేని స్థితికి చేరిన శివమ్మ ఇంటికే పరిమితమైపోయింది. శివమ్మ అవస్థను గుర్తించిన ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ బాలయ్య.. ఆమె గతంలో మూడేళ్లపాటు పొందిన పెన్షన్‌కు సంబంధించిన ఆధారాలతో ఎంపీడీవో కార్యాలయ అధికారుల వద్దకు  వెళ్లారు. పింఛను ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. శివమ్మ చనిపోయినట్టు తమ రికార్డుల్లో ఉన్నదని చెప్పడంతో అవాక్కయ్యారు. ఆమె బతికే ఉన్నదని, ఇంట్లోనే నడవలేని స్థితిలో ఉన్నదని చెప్పినా వారు పింఛనును పునరుద్ధరించేందుకు ఒప్పుకోలేదని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

Updated Date - 2022-01-27T06:05:37+05:30 IST