నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

ABN , First Publish Date - 2020-07-02T10:44:30+05:30 IST

నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి


ఆసిఫాబాద్‌, జూలై1: నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం జడ్పీ కార్యాలయం, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐదు విడతల్లో 1.82 కోట్ల మొక్కలను నాటడం జరిగిందన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా 30 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు 25 శాతంగా ఉన్న అడవులను 33 శాతంగా పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. కుమరం భీం జిల్లాలో 52 లక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 8 లక్షల మొక్కలను జిల్లాలో నాటడం జరిగిందన్నారు.


నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన టాంకర్ల ద్వారా నిత్యం నీరు అందించి 85 శాతం మొక్కలు బతికే విధంగా దృష్టి సారించాలన్నారు. ఆడవులు అంతరించి పోయిన చోట ఆడవుల పునర్జీవన కార్యక్రమం ద్వారా ఆడవులను విస్తారించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అంతకు ముందు మంత్రి ఐకే రెడ్డి పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. 


ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ కోవలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణరావు, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఆదనపు కలెక్టర్‌ రాంబాబు, జడ్పీ సీఈఓ వేణు, ఏఎస్పీ సుదీంద్ర, జిల్లా గ్రందాలయ సంస్థ ఛైర్మన్‌ కనక యాదవరావు,  జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆటవీశాఖ ఆధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-02T10:44:30+05:30 IST