ఇంటింటి సర్వేకు అందరూ సహకరించాలి
ABN , First Publish Date - 2022-01-21T04:01:42+05:30 IST
కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో కొమురం బాలు తెలిపారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వారం రోజుల పాటు నాణ్యత ప్రమాణాలతో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రజల ఆరోగ్యంపై సర్వే నిర్వహించి జ్వరం, కొవిడ్ లక్షణాలుంటే మందులతో పటు పలు జాగ్రత్తలు సూచిస్తారని, ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు.
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 20: కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశానుసారం శుక్రవారం ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించనున్నట్లు డీఎంహెచ్వో కొమురం బాలు తెలిపారు. గురువారం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వారం రోజుల పాటు నాణ్యత ప్రమాణాలతో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నామని, ఆశా వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు ప్రజల ఆరోగ్యంపై సర్వే నిర్వహించి జ్వరం, కొవిడ్ లక్షణాలుంటే మందులతో పటు పలు జాగ్రత్తలు సూచిస్తారని, ప్రతీ ఒక్కరు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరారు. పరీక్షల ఆధారంగా హోంఐసోలేషన్ చికిత్సకు సంబంధించిన మందుల కిట్తోపాటు వైద్యుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇంటింటికి ఫీవర్ సర్వే నిర్వహించడం ద్వారా కొవిడ్ వ్యాప్తి నియంత్రణ సాధ్యమవుతుందని, ఇందులో ప్రజలందరు భాగస్వాములు కావాలన్నారు. ఇంటింటి ఆరోగ్యం కార్యక్రమానికి సంబంధించి 485 మంది హెల్త్ టీంను గ్రామీణ, పట్టణ స్ధాయిలో కేటాయించామని , ప్రతి రోజు వంద ఇండ్లు సర్వే చేస్తారన్నారు. కొవిడ్ లక్షణాలున్న వారిని గుర్తించి తీవ్రతను బట్టి పీహెచ్సీ, దగ్గరలోని ఆసుపత్రులకు తరలిస్తారని పేర్కొన్నారు. మంచిర్యాలలో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎక్కువ శాతం సింగరేణికి ప్రాంతంలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్, వెంటిలేటర్, ఇంజక్షన్లు అందుబాటులో ఉంచామన్నారు. చిన్న పిల్లలు జ్వరం బారిన పడకుండా చూడాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో ఫయాజ్ఖాన్, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, విజయపూర్ణిమ, బుక్కా వెంకటేశ్వర్, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటింటా సర్వే
మందమర్రిటౌన్ : కరోనా కట్టడికి ప్రభుత్వ వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. శుక్రవారం నుంచి మందమర్రి పట్టణంలోని 24 వార్డుల్లో ఈ సర్వే చేపట్టనున్నారు. దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడు తున్న వారికి మందులను పంపిణీ చేయనున్నారు. ప్రజలు సహకరించాలని వైద్యురాలు శైలజ పేర్కొ న్నారు. ప్రజారోగ్యం కోసం సర్వే చేపడుతున్నామని, అందరూ సహకరించాలని కోరారు.