రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

ABN , First Publish Date - 2021-05-05T09:08:08+05:30 IST

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలో సీఐడీ విచారణకు హాజరైన ఆయన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన

తప్పుడు కేసులతో పైశాచిక ఆనందం

సీఐడీ విచారణలో అన్నీ చెప్పినా ఇబ్బంది పెడుతున్నారు

వివేకా హత్యకేసులో విజయసాయి, కొమ్మినేనిలను విచారించాలి

మాజీ మంత్రి దేవినేని ఉమా ధ్వజం

మూడోరోజూ 9 గంటలు సీఐడీ విచారణ


జి.కొండూరు, మే 4: రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యమేలుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. మంగళవారం మంగళగిరిలో సీఐడీ విచారణకు హాజరైన ఆయన అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా  విలయతాండవం చేస్తుంటే , తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణలో అన్నీ చెప్పినప్పటికీ పిలిచి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 41 కింద హైకోర్టు తనకు బెనిఫిట్స్‌ ఇస్తే, అధికారులు వాటిని కాలరాస్తున్నారన్నారు. రోజుకు తొమ్మిది గంటల చొప్పున రెండు రోజులు విచారణ జరిపి, మళ్లీ మూడో రోజు విచారణకు పిలిచారని ఆక్షేపించారు. కేసులు పెట్టి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ను, సంగం డెయిరీ ఎండీని పోలీ్‌సస్టేషన్ల చుట్టూ తిప్పి అస్వస్థతకు గురి చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ప్రభుత్వాస్పత్రుల్ని సందర్శించాలని డిమాండ్‌ చేశారు. మీడియా ముందుకు రాకుండా ప్రజలకు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. వివేకానంద హత్య కేసులో విజయసాయిరెడ్డి, సాక్షి టీవీ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులను విచారిస్తే ఈపాటికి నిజాలు తెలిసేవన్నారు.


అంతకుముందు దేవినేని ఉమాను సీఐడీ అధికారులు తొమ్మిది గంటల పాటు విచారణ చేశారు. సీఎం జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్‌, సోషల్‌ మీడియా పోస్టింగ్స్‌పై విచారించారు. సోషల్‌ మీడియా నిర్వహణ ఎవరు చూస్తారో చెప్పాలని ఉమాను ప్రశ్నించారు. టాబ్‌ ఏదని ప్రశ్నించగా అది పోయిందని ఉమా బదులిచ్చారు. దీంతో సాంకేతిక పరిజ్ఞానంతో టాబ్‌ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్ఫింగ్‌ వీడియో ప్రదర్శించారని చెబుతున్న టాబ్‌ చుట్టూనే దర్యాప్తు మొత్తం తిరిగింది. ఆయనను మరోమారు విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. 

Updated Date - 2021-05-05T09:08:08+05:30 IST