చంద్రబాబుకు రుణపడి ఉంటాం

ABN , First Publish Date - 2021-06-17T17:09:48+05:30 IST

నాటి సీఎం చంద్రబాబుకు..

చంద్రబాబుకు రుణపడి ఉంటాం

ఉద్యోగాలు పొందిన 2018 డీఎస్సీ అభ్యర్థుల హర్షం


కడప: జిల్లాలో ఉద్యోగాలు పొందిన 2018 డీఎస్సీ అభ్యర్థులు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాము నాటి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని అంటున్నారు. ఉర్దూ, పీఈటీ, తెలుగు తదితర టీచర్ పోస్టులు పెంచాలని, నిరుద్యోగ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతూ 2017లో నిరుద్యోగ భృతి ప్రారంభోత్సవ సభలో నాటి సీఎం చంద్రబాబుకు నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. వీరి విన్నపాన్ని ఆలకించిన చంద్రబాబు ఎట్టకేలకు పోస్టులను పెంచి 2018 డీఎస్సీ నిర్వహించారు. అయితే వివిధ కారణాల వల్ల నియామక ఉత్తర్వులు జారీ చేయడం వాయిదా పడుతూ వచ్చింది.


ఈలోగా వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. 2018 డీఎస్సీ రాసిన నిరుద్యోగ ఉపాధ్యాయులు రెండేళ్లుగా పోరాటం సాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు డీఎస్సీలో అర్హత సాధించిన 17మంది జిల్లా వాసులకు బుధవారం నియామక ఉత్తర్వులు అందజేశారు. దీంతో వారిలో ఆనందోత్సవం వెల్లవిరిసింది. ఆరోజు చంద్రబాబు తమ విన్నపం ఆలకించడంతో ఉపాధ్యాయులు కావాలనే కల సాకారం అయిందని ఆంధ్రజ్యోతికి వివరించారు. నాటి సీఎం చంద్రబాబు తమ మొర ఆలకించడంతోనే నేడు ఉద్యోగం వచ్చిందని తెలుగు ఉపాధ్యాయుడిగా నియామక ఉత్తర్వు అందుకున్న గాలివీడుకు చెందిన గంగరాజు తెలిపారు. పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించిన ఆనాటి సీఎం చంద్రబాబుకు రుణపడి ఉంటామని ఉర్దూ ఉపాధ్యాయుడిగా నియామక పత్రం అందుకున్న చాకిబండ గ్రామానికి చెందిన షబ్బీర్ అహ్మద్ అన్నారు.

Updated Date - 2021-06-17T17:09:48+05:30 IST