ప్రజాగ్రహాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి : దేవేంద్ర ఫడణ్వీస్
ABN , First Publish Date - 2021-04-11T00:49:02+05:30 IST
కరోనా దృష్ట్యా రాష్ట్రంలో కఠిన నిర్ణయాలు అమలు చేయడం మంచిదే అని, అయితే ప్రజల కోపాన్ని కూడా పరిగణనలోకి
ముంబై : కరోనా దృష్ట్యా రాష్ట్రంలో కఠిన నిర్ణయాలు అమలు చేయడం మంచిదే అని, అయితే ప్రజల కోపాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని వ్యవహరించాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణ్వీస్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కరోనా పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్ధవ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణ్వీస్ కూడా హాజరయ్యారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను విపరీతంగా పెంచాలని, డిమాండ్కు తగ్గట్టుగా ఆస్పత్రులలో బెడ్స్ను కూడా ఏర్పాటు చేయాలని ఫడణ్వీస్ సూచించారు. లాక్డౌన్ కారణంగా గత సంవత్సరమే అస్తవ్యస్థమైందని, తమ విద్యుత్ బిల్లులు కూడా సర్కారే చెల్లించాలని ప్రజలు డిమాండ్ చేశారని ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కరోనా కారణంగా కఠినమైన ఆంక్షలు తక్కువగా ఉండాలని, లేదంటే ప్రజలు జీవించడం ఎలా సాధ్యమైతుందని ఆయన అన్నారు. రాష్ట్రంపై అప్పుల భారం విపరీతంగా పెరిగిపోతోందని, వ్యాపారులు చనిపోతున్నారని పేర్కొన్నారు. ఇవేవీ పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తే మాత్రం ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుందని దేవేంద్ర ఫడణ్వీస్ సీఎం ఉద్ధవ్తో అన్నారు.