అది ఆక్రమణ కాదా!
ABN , First Publish Date - 2021-01-17T04:47:25+05:30 IST
పెందుర్తి శాసనసభ్యుడు అదీప్రాజ్ కొండను ఆక్రమించి నిర్మించిన గెస్ట్హౌస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెంటనే పడగొట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు.
మీ ఎమ్మెల్యే కొండనే మింగేశాడు
గెస్ట్హౌస్ నిర్మించుకున్నా పట్టించుకోరేం
ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీ మంత్రి బండారు ఫైర్
చిత్తశుద్ధి ఉంటే తక్షణం కూల్చివేయండి
విశాఖపట్నం, జనవరి 16: పెందుర్తి శాసనసభ్యుడు అదీప్రాజ్ కొండను ఆక్రమించి నిర్మించిన గెస్ట్హౌస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వెంటనే పడగొట్టాలని తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యుడు బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. విశాఖనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీడీపీకి చెందిన సబ్బంహరి, పీలాగోవింద్, గీతం విద్యా సంస్థలపై దాడులు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం బురద చల్లిందని, మరి వైసీపీ నాయకుల ఆక్రమణలపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు నాయకుల ఆక్రమణల చిట్టా తనవద్ద ఉందన్నారు.
పరవాడలో ఎమ్మెల్యే తండ్రి పేరుతో సముద్ర ఇసుక తరలించారని, 60 ఎకరాల చేపల చెరువును ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇన్ని జరుగుతున్నా తమ పార్టీ వారికి అవినీతంటే ఏంటో తెలియనట్టు, గొప్ప నిజాయితీపరుల్లా విజయసాయిరెడ్డి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ నాయకుల ఆక్రమణలపై చర్యలు తీసుకోకుంటే అందరి బాగోతాలు బయటపెడతానని హెచ్చరించారు.