మాజీ ఎమ్మెల్యే దొరస్వామిరాజు మృతి

ABN , First Publish Date - 2021-01-19T07:37:36+05:30 IST

నగరి మాజీ ఎమ్మెల్యే, సినీరంగ ప్రముఖుడు వి.దొరస్వామి రాజు (79)అనారోగ్యంతో కన్నుమూశారు.

మాజీ ఎమ్మెల్యే దొరస్వామిరాజు మృతి

పుత్తూరు, జనవరి 18: నగరి  మాజీ ఎమ్మెల్యే, సినీరంగ ప్రముఖుడు వి.దొరస్వామి రాజు (79)అనారోగ్యంతో కన్నుమూశారు. వయోభారంతో వచ్చిన రుగ్మతలతో మూడురోజుల క్రితం హైదరాబాదులోని కేర్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం ఉదయం 7-30 గంటలకు తుది శ్వాస విడిచారు.భార్య నిర్మల 2006లో చనిపోయాక హైదరాబాదులో కుమారుడు విజయకుమార్‌ వర్మతో దొరస్వామిరాజు కలసి వుండేవారు.కుమారై విజయలక్ష్మి అమెరికాలో వుంటున్నారు.విజయపురం మండలం వరదరాజులకండ్రిగలో 1941లో జన్మించిన ఆయన చెన్నైలో బీకాం పూర్తి చేసి సీఏలో చేరారు.సినీ పరిశ్రమ ఆకర్షించడంతో సీఏని  మధ్యలో ఆపేసి  అటువైపు మళ్లారు.వీఎంసీ ఫిల్మ్స్‌  కంపెనీ స్థాపించి వందలాది సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన ఆయన అదే బ్యానర్‌ పేరుతో 11 సినిమాలనూ నిర్మించారు.అన్నమయ్య,సీతారామయ్య గారి మనవరాలు,సింహాద్రి వంటి ప్రముఖ చిత్రాలు వాటిలో వున్నాయి. సినిమా రంగంలో కొనసాగుతూనే ఎన్టీఆర్‌ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన  దొరస్వామిరాజు 1994లో నగరి నియోజకవర్గంనుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్‌ ప్రముఖుడు చెంగారెడ్డి మీద 13వేల మెజారిటీతో గెలుపొందారు.1999ఎన్నికల్లో చెంగారెడ్డి మీదే పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాక రాజకీయాలనుంచి తప్పుకున్నారు.టీటీడీ బోర్డు సభ్యుడిగా, ఫిల్మ్‌ ఛాంబర్‌, పంపిణీ మండలి, ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌లకు అధ్యక్షుడిగా పని చేశారు.నీతి నిజాయితీలతో రాజకీయాలను నడిపి మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయాల్లో చేరి సినిమాల్లో సంపాదించిన ఆస్తులను పోగొట్టుకున్నానని ఆయన అనేవారని సన్నిహితులు చెబుతుంటారు.కాగా దొరస్వామిరాజు సినీ పరిశ్రమకే కాకుండా నగరి ఎమ్మెల్యేగా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మన్ననలు పొందారని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి గుర్తు చేసుకున్నారు.   ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.దొరస్వామి రాజును కోల్పోవడం బాధాకరమని రాష్ట్రీయ క్షత్రియ సేవా సంఘం అధ్యక్షుడు, సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాలల ఛైర్మన్‌ కె.అశోక్‌రాజు అన్నారు. మంచికి మారుపేరైన ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేరని  నగరి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గాలి భానుప్రకాష్‌  పేర్కొన్నారు.అలాగే టీడీపీ నాయకుడు విజయబాబు,సింగిల్‌విండో  మాజీ  అధ్యక్షుడు రవి నాయుడు, మాజీ ఎంపీపీ గోవిందస్వామి  తదితరులు సంతాపం ప్రకటించారు.దొరస్వామిరాజు హఠాన్మరణం తెలుగుచలనచిత్ర పరిశ్రమకు తీరని లోటుగా దక్షిణభారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు కాట్రగడ్డ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించిన మహానటుడు ఎన్టీఆర్‌ చేతుల మీదుగానే రాజకీయ ప్రవేశం చేసిన దొరస్వామిరాజు అదే ఎన్టీఆర్‌ వర్ధంతినాడే దివంగతులవడం ఎంతో బాధకు గురి చేసిందన్నారు.

Updated Date - 2021-01-19T07:37:36+05:30 IST