పోలీసు శాఖ సిగ్గుతో తలదించుకోవాలి

ABN , First Publish Date - 2021-10-25T05:03:50+05:30 IST

పదే పదే పోలీసు వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం చేయటం చూస్తుంటే పోలీసుశాఖ సిగ్గుతో తలదించుకోవాలన్నట్టు ఉందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు.

పోలీసు శాఖ సిగ్గుతో తలదించుకోవాలి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి

మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి

పెదకూరపాడు, అక్టోబరు 24: పదే పదే పోలీసు వ్యవస్థపై హైకోర్టు ఆగ్రహం చేయటం చూస్తుంటే పోలీసుశాఖ సిగ్గుతో తలదించుకోవాలన్నట్టు ఉందని మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ అన్నారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నేతలతో కలసి మాట్లాడుతూ కొంతమంది పోలీసుల తీరు యావత్తు శాఖకే మాయని మచ్చ తెచ్చిపెట్టిందని, ఎన్నిసార్లు కోర్టు మొట్టికాయలు వేసినా నిస్సిగ్గుగా వ్యవహరించటం సిగ్గు చేటన్నారు. పట్టాభి మాట్లాడిన మాటకు ముఖ్యమంత్రి తమ కార్యకర్తలకు, అభిమానులకు బీపీ వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ధ్వంసం చేశారని మీడియా ద్వారా చెప్పటం పోలీసులకు కన్పించలేదా?  అన్నారు. ఇప్పటికైనా పోలీసు శాఖ తమ పద్ధతిని మార్చుకోవాలన్నారు. ముఖ్యమంత్రిని దూషించారు కాబట్టి అరెస్టు చేశామని చెపుతున్న పోలీసు వారికి హైకోర్టు న్యాయమూర్తులను దూషించిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని సూటిగా ప్రశ్నించిన మాట వాస్తవమే కదా? అన్నారు.  పట్టాభి మాట్లాడిన మాటకు తమ కార్యకర్తలు దాడి చేశారని ముఖ్యమంత్రి చెప్పటంతో రాష్ట్రంలోని వైసీపీ నాయకులందరూ అదే పదాన్ని రాష్ట్ర ప్రజలందరికీ వినిపించేలా చేస్తున్నారని, ఇంత కంటే నీచమైన రాజకీయం ఉంటుందా? అని ప్రశ్నించారు. 

 

Updated Date - 2021-10-25T05:03:50+05:30 IST