రైతులను ఆదుకునే బాధ్యత లేదా?
ABN , First Publish Date - 2021-12-08T05:36:21+05:30 IST
అధిక వర్షాలు, బొబ్బర తెగులుతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన యరపతినేని
దాచేపల్లి, డిసెంబరు7: అధిక వర్షాలు, బొబ్బర తెగులుతో నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. మంగళవారం దాచేపల్లి మండలంలోని నడికుడి గ్రామంలో బొబ్బర తెగులుతో దెబ్బతిన్న మిర్చి, ప్రత్తి, పంటలను యరపతినేని కార్యకర్తలు, నాయకులతో కలసి వచ్చి పరిశీలించారు. మిర్చి రైతులు మాట్లాడుతూ ఆరుగాలం శ్రమించి, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికొస్తుందన్న తరుణంలో తెగులు సోకిందన్నారు. యరపతినేని మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. గుంటూరు మార్కెట్యార్డుకు 85శాతం మిర్చి పల్నాడు ప్రాంతం నుండే వస్తుందని వివరించారు. సీఎం జగన్ వరిపంట సాగు వద ్దంటున్నారు.. మరి రైతులు ఏపంటలు పండించాలో తెలియజేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు, పురుగుమందులు, మిర్చి రైతుకు ఎకరాకు రూ.లక్ష, ప్రత్తి రైతుకు రూ.75వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ రైతులకు అండగా ఉంటుందన్నారు.
ఓటీఎస్ కట్టొదు...
రైతులు, కూలీలు ప్రకృతి వైపరీత్యాలతో తల్లడిల్లిపోతుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు ఓటీఎస్ రూపంలో చెల్లించాలని అధికారులతో వత్తిడి చేయించటం సబబు కాదన్నారు. లబ్ధిదారులు ఎవరూ కూడా ఓటీఎస్ చెల్లించవద్దని టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతుందని విమర్శించారు. కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ రైతు విభాగం అధ్యక్షులు మద్దూరి వీరారెడ్డి, గుంటుపల్లి నాగేశ్వరరావు, రైతు కార్యదర్శి వేముల వినోద్రెడ్డి, వేముల తిరుమలకుమార్, తదితరులు పాల్గొన్నారు.