ఆర్థిక వ్యవస్థలో కొన్ని మెరుపులు, మరెన్నో మరకలు : రఘురామ్ రాజన్

ABN , First Publish Date - 2022-01-23T21:21:17+05:30 IST

భారత దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని మెరుపులు, అనేక మరకలు ఉన్నాయని

ఆర్థిక వ్యవస్థలో కొన్ని మెరుపులు, మరెన్నో మరకలు : రఘురామ్ రాజన్

న్యూఢిల్లీ : భారత దేశ ఆర్థిక వ్యవస్థకు కొన్ని మెరుపులు, అనేక మరకలు ఉన్నాయని భారతీయ రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. భారీ ద్రవ్య లోటు ఏర్పడకుండా చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వల్ల దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ K-ఆకృతిలో కోలుకోవడాన్ని నిరోధించేందుకు ప్రభుత్వం ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందన్నారు. 


మహమ్మారి వల్ల చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభావితమైన చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమల కన్నా టెక్నాలజీ, లార్జ్ కేపిటల్ ఫర్మ్స్ అత్యంత వేగంగా కోలుకునే పరిస్థితిని K-ఆకృతిలో రికవరీ అవడం అంటారు. 


రఘురామ్ రాజన్ ప్రస్తుతం చికాగో విశ్వవిద్యాలయం బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థ గురించి తన తీవ్ర ఆందోళనకు కారణం బాలలు, చిన్న తరహా, మధ్య తరహా పారిశ్రామిక రంగం, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులేనని చెప్పారు. పెంట్-అప్ డిమాండ్ వల్ల కోలుకునే ప్రారంభ దశలో ఈ అంశాలన్నీ ముందుకు వస్తాయని చెప్పారు. ప్రస్తుతం వినియోగం వృద్ధి బలహీనంగా ఉండటం దీనికి ఓ సూచన అని, ముఖ్యంగా సామూహిక వినియోగ వస్తువుల వినియోగ వృద్ధి బలహీనంగా ఉందని తెలిపారు.  ప్రజలు ఖర్చు పెట్టడం కొంత కాలం పాటు తగ్గించిన తర్వాత మళ్ళీ ఖర్చు పెట్టడాన్ని పునరుద్ధరించడాన్ని పెంట్-అప్ డిమాండ్ అంటారు. 


భారత దేశ ఆర్థిక వ్యవస్థలో మెరుపులను వివరిస్తూ, భారీ సంస్థల పరిస్థితి బాగుందన్నారు. ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్స్ కూడా అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాయన్నారు. అనేక రంగాల్లో యూనికార్న్స్ పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెప్పారు. ఆర్థిక రంగంలో కొన్ని విభాగాలు పటిష్టంగా ఉన్నట్లు తెలిపారు. 


నిరుద్యోగం తీవ్రత, తక్కువ కొనుగోలు శక్తి, దిగువ మధ్య తరగతి ప్రజల కొనుగోలు శక్తి అతి తక్కువగా ఉండటం, చిన్న తరహా, మధ్య తరహా సంస్థలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిళ్ళు, అతి తక్కువ క్రెడిట్ గ్రోత్, విద్యా రంగం దయనీయ పరిస్థితులు వంటివి భారత దేశ ఆర్థిక వ్యవస్థలో మరకలని చెప్పారు.


కరోనా వైరస్ రూపాంతరం ఒమైక్రాన్ వల్ల వైద్యపరంగానూ, ఆర్థికంగానూ ఎదురుదెబ్బ తగిలిందన్నారు. K-ఆకృతిలో ఆర్థిక వ్యవస్థ కోలుకునే అవకాశంపై ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దీనిని నిరోధించేందుకు ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉందన్నారు. 


Updated Date - 2022-01-23T21:21:17+05:30 IST