విద్యార్థులకు పరీక్షా కాలం.. జూలై
ABN , First Publish Date - 2021-06-21T10:09:09+05:30 IST
విద్యాసంస్థలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో... వాయిదాపడ్డ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.
- మొదటివారంలో ఇంజినీరింగ్, ఫార్మసీ పరీక్షలు
- నేడు షెడ్యూల్ ప్రకటించనున్న జేఎన్టీయూ
- ఇతర డిగ్రీ పరీక్షల నిర్వహణకూ సన్నాహాలు
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): విద్యాసంస్థలను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో... వాయిదాపడ్డ పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావడానికి 15-20 రోజులు సమయం ఇచ్చి తేదీలను ప్రకటించనున్నారు. జూలై మొదటివారంలో పరీక్షలు ప్రారంభించి అదే నెలాఖరుకు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో.. ఫైనలియర్ విద్యార్థులకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించాలని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) తొలుత భావించింది. అయితే కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కొంచెం ఆలస్యమైనా ఆఫ్లైన్లోనే పరీక్షలు నిర్వహించాలని ఇటీవల నిర్ణయించింది. తాజాగా విద్యాసంస్థలు తెరవడానికి ప్రభుత్వమే అనుమతించడంతో.. ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ చివరి సెమిస్టర్ పరీక్షల నిర్వహణకు మార్గం సుగుమమైంది. జూలై మొదటివారంలో జేఎన్టీయూ ఈ పరీక్షలను నిర్వహించనుంది. ప్రథమ సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు కూడా ఇంకా జరగలేదు.
వారికీ జూలై మొదటివారంలోనే పరీక్షలు జరగనున్నాయి. రోజువిడిచి రోజు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు జేఎన్టీయూ రిజిస్ర్టార్ ప్రొఫెసర్ మన్జూర్ హుసేన్ తెలిపారు. పరీక్షల తేదీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఉస్మానియా, కాకతీయ వర్సిటీల పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకూ జూలైలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. పెండింగులో ఉన్న పరీక్షలను పూర్తిచేసేందుకు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) కూడా సన్నాహాలు ప్రారంభించింది. ఇవి పూర్తయ్యాక ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థుల పరీక్షలపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఇతర డిగ్రీ పరీక్షలపై కూడా కాలేజీ విద్యావిభాగం దృష్టి సారించింది. ఏటా ఏప్రిల్, మే నెలల్లో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల విద్యార్థుల రెండో సెమిస్టర్ పరీక్షలు పూర్తవుతాయి. అందరికీ రెండు సెమిస్టర్ల పరీక్షలు జరపాల్సి ఉంది. ఫస్టియర్ పరీక్షల ఫీజు వివరాలను కొన్ని వర్సిటీలు ఇప్పటికే ప్రకటించాయి. పెండింగులో ఉన్న సెమిస్టర్ పరీక్షలన్నీ ఒకేసారి కాకుండా మధ్యలో కాస్త విరామం ఇవ్వాలని వర్సిటీలు భావిస్తున్నాయి.