భీమిలి డైట్లో ధ్రువపత్రాల పరిశీలన
ABN , First Publish Date - 2022-01-18T05:20:31+05:30 IST
ఎట్టకేలకు డీఈఈ సెట్ అభ్యర్థులు డైట్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి సోమవారం ధ్రువపత్రాల పరిశీలన జరిగింది.
భీమునిపట్నం, జనవరి 17: ఎట్టకేలకు డీఈఈ సెట్ అభ్యర్థులు డైట్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి సోమవారం ధ్రువపత్రాల పరిశీలన జరిగింది. భీమిలి ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ డైట్లో ఉదయం పది గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అక్టోబరు 26, 27 తేదీల్లో డీఈఈ సెట్ జరిగింది. అప్పటినుంచి ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో ఈ సెట్ రాసిన అభ్యర్థులలో ఆందోళన నెలకొంది. అసలు ప్రభుత్వం డైట్ కళాశాలల ప్రవేశాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుందా, లేదా? అనే కంగారుతో పాటు అకడమిక్ ఇయర్ వృథా అయిపోతుందేమోననే మానసిక ఆందోళనతో ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం 60 మంది అభ్యర్థులకు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించారు. అనంతరం ఆన్లైన్లో అభ్యర్థుల పేర్లు నమోదు చేసి సంబంధిత ఫీజులు చెల్లించడంతో అలాట్మెంట్ ప్రక్రియ పూర్తి చేసినట్టు డైట్ అధ్యాపక వర్గాలు తెలిపాయి. ఈ నెల 31న తొలి ఇన్స్ట్రక్షన్ డేతో 2021-23 బ్యాచ్కు తరగతులను ప్రారంభిస్తామన్నారు.