సడలింపు వేళ్లలో ట్రాఫికర్
ABN , First Publish Date - 2021-06-12T05:28:03+05:30 IST
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్కాపురం పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజల ప్రాఽథమిక అవసరాల నిమిత్తం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సమయాల్లో మినహా మార్కాపురంలో పోలీసులు కనపడటం లేదు. కర్ఫ్యూ మినహాయింపు సమయంలో ప్రజలు ఇష్టారీతిన రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది
- కానరాని పోలీసులు
- ప్రజలకు తప్పని ఇబ్బందులు
మార్కాపురం, జూన్ 11: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మార్కాపురం పట్టణంలో కర్ఫ్యూ నిబంధనలను అమలు చేస్తున్నారు. ప్రజల ప్రాఽథమిక అవసరాల నిమిత్తం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రభుత్వం ప్రకటించిన కర్ఫ్యూ సమయాల్లో మినహా మార్కాపురంలో పోలీసులు కనపడటం లేదు. కర్ఫ్యూ మినహాయింపు సమయంలో ప్రజలు ఇష్టారీతిన రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రజలు గుంపులు గుంపులుగా భౌతిక దూరం పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు.
మార్కాపురం పట్టణంలో మినహాయింపు సమయంలో అన్ని వ్యాపార సంస్థలు నిర్వహించుకోవచ్చు. దీంతో మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలు ఆటోలు, ద్విచక్ర వాహనాలు, బస్సులలో పట్టణానికి వస్తున్నారు. ఎక్కువ మంది ఒకేచోట చేరుతున్నారు. కరోనా నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు.
కనిపించని భౌతికదూరం
- కర్ఫ్యూ సమయంలో దొంగచాటుగా అమ్మకాలు
గిద్దలూరు : కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదు. నియోజకవర్గంలో నిత్యం 50కిపైగానే కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ రోడ్లపైకి వచ్చే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. కర్ఫ్యూ సడలింపు సమయంలో రోడ్లపై గాని, దుకాణాలలో గాని, మార్కెట్లలో గాని భౌతికదూరం పాటించడం లేదు. జనం ఆయా ప్రాంతాల్లో గుంపులు గుంపులుగానే ఉంటున్నారు. గిద్దలూరు పట్టణంలోని పెద్దబజారు, స్టేషన్ రోడ్డు, పొట్టిశ్రీరాములు రోడ్డు, చిన్నకూరగాయల మార్కెట్, రాచర్లగేటు సెంటర్ తదితర ప్రాంతాల్లో ఇసుక వేస్తే రాలనంతగా జనం కనిపిస్తున్నారు. అలాగే మద్యం దుకాణాలు, బ్యాంక్ల వద్ద ట్రాఫిక్ సమస్యతోపాటు భౌతికదూరం చూద్దామంటే కూడా పాటించడం లేదు. ఇక కర్ఫ్యూ సమయంలో పోలీసుల పర్యవేక్షణ పెద్దగా ఉండడం లేదు. ఏదో ఒకటి, రెండు సమయాలలో అధికారులు వచ్చిన సందర్భాలలో కర్ఫ్యూ అమలు బాగానే ఉన్నప్పటికీ పోలీసులు వెళ్లగానే కొంతమంది వ్యాపారులు షట్టర్ల్లు పైకి ఎత్తి వ్యాపారం కొనసాగిస్తున్నారు. పార్శిల్స్కే పరిమితం కావలసిన కొన్ని రెస్టారెంట్లలో సిట్టింగ్ కూడా యథేచ్ఛగా జరుగుతున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రధాన వీధుల్లో మినహా చిన్న సందుల్లో ఉన్న వ్యాపారాలు దాదాపు కొనసాగుతున్నాయి. సాయంత్రం అయితే కొన్ని సెంటర్లలో గొందుల్లో బండ్లను ఉంచి పానీపూరి, కట్లెట్, గోబీ లాంటి అమ్మకాలు జరుగుతున్నాయి.