ప్రవాసులకు ఒమన్లో ఆస్తి కొనుగోలు చేసే అవకాశం !
ABN , First Publish Date - 2020-10-19T13:46:27+05:30 IST
ఒమన్లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది.
మస్కట్: ఒమన్లోని ప్రవాసులకు అక్కడి సర్కార్ ఆస్తి కొనుగోలు చేసే అవకాశం కల్పించింది. గవర్నరేట్ ఆఫ్ మస్కట్లోని బహుళ అంతస్తుల భవనాల్లో అపార్ట్మెంట్లను కొనుగోలు చేయవచ్చు. గృహ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు తీర్మానాన్ని జారీ చేసింది. నాన్ ఒమానిస్ ఎవరైతే రెండేళ్లుగా సుల్తానేట్లో నివాసం ఉంటున్నారో వారు ఆస్తిని కొనుగోలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ప్రాపర్టీలు ప్రభుత్వం పేర్కొన్న సైట్లలోనే ఉంటాయి. అలాగే వీటికి గృహనిర్మాణ మరియు పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ లైసెన్స్ జారీ చేస్తుంది.
ఇక రిజిస్ట్రేషన్ ఫీజుల విషయానికి వస్తే... విక్రేత చెల్లించే ఫీజులు యూనిట్ విలువలో 3 శాతంగా ఉంటే... లబ్ధిదారునికి యూనిట్ విలువలో 5 శాతంగా ఉంటుంది. దేశ జనాభాను దృష్టిలో ఉంచుకుని ప్రవాసులను ఆస్తి కొనుగోలు చేయమని ప్రోత్సహించడం తమ లక్ష్యమని మంత్రిత్వ శాఖ తన తీర్మానంలో పేర్కొంది. ఈ విధానం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పోటీతో కూడిన వ్యాపార వాతావరణాన్ని సృష్టించడానికి ఇది దోహదం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి నగదును కూడా ప్రవేశపెడుతుందన్నారు.