భారత హాకీ జట్టు విజయాన్ని.. బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్న ప్రవాసులు!

ABN , First Publish Date - 2021-08-07T14:48:30+05:30 IST

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సంచలనమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే.

భారత హాకీ జట్టు విజయాన్ని.. బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్న ప్రవాసులు!

దుబాయ్: టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు సంచలనమైన ఆటతీరుతో కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. కాంస్య పోరులో జర్మనీపై 5-4 తేడాతో భారత్ సంచలన విజయంతో పతకాన్ని ముద్దాడింది. దీంతో 41 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ భారత హాకీ జట్టు దేశానికి మరో పతకం అందించినట్లైంది. ఈ విజయం యావత్ భారతావణి గర్వపడేలా చేసింది. తాజాగా యూఏఈలోని కొందరు భారత ప్రవాసులు ఈ అపూర్వ విజయాన్ని ప్రపంచంలోని అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్‌ ఖలీఫా వద్ద సెలబ్రేట్ చేసుకున్నారు.


భారత జాతీయ జెండాతో పాటు, హాకీ జట్టు సభ్యుల ఫొటోలతో ఉన్న ప్లడ్‌కార్డులను ప్రదర్శించారు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌కు దక్కిన ఈ విజయం ఎంతో గొప్పదని వారు స్వీట్లు పంచుకున్నారు. భారత హాకీ జట్టు నిజంగా అద్భుతం చేసిందన్నారు. ఒకప్పుడు హాకీలో తిరుగులేకుండా ఉన్న భారత్‌కు గడిచిన కొన్నేళ్లుగా కఠినంగా గడిచాయని ప్రవాసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు భారత హాకీకి మంచి రోజులు వస్తున్నాయని తెలిపారు. ఈ విజయం భారత హాకీకి పునర్జీవనం లాంటిదన్నారు. అటు మహిళల హాకీ జట్టు ప్రదర్శన కూడా అమోఘమని పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-07T14:48:30+05:30 IST