కాబూల్ మసీదు వద్ద పేలుడు

ABN , First Publish Date - 2021-10-04T00:34:34+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లోని ఓ మసీదు

కాబూల్ మసీదు వద్ద పేలుడు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని నగరం కాబూల్‌లోని ఓ మసీదు వద్ద ఆదివారం జరిగిన పేలుడులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. విశాలమైన ఈద్గా మసీదు ప్రవేశ మార్గంలో ఈ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కొందరు వ్యక్తులు మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఓ ట్వీట్‌లో తెలిపారు. అయితే ఇద్దరు మరణించినట్లు ఇంటీరియర్ మినిస్ట్రీ వెల్లడించింది. 


ఇంటీరియర్ మినిస్ట్రీ అధికార ప్రతినిధి కరి సయద్ ఖోస్టి ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కాబూల్ మసీదు వెలుపల జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు సాధారణ పౌరులు మరణించారని, ముగ్గురు గాయపడ్డారని తమకు అందిన ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందన్నారు. గాయపడినవారిని కాబూల్‌లోని ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు. తమ ఆసుపత్రిలో నలుగురు క్షతగాత్రులు చేరినట్లు ఆ ఆసుపత్రి ట్విటర్ వేదికగా తెలిపింది. 


ఈ మసీదుకు సమీపంలోని ఓ దుకాణదారు అహ్మదుల్లా మీడియాతో మాట్లాడుతూ, మసీదు వెలుపల బాంబు పేలుడు శబ్దం వినిపించిందని, ఆ తర్వాత తుపాకీ కాల్పులు కూడా వినిపించాయని చెప్పారు. 


ఇదిలావుండగా జబీహుల్లా తల్లి గత వారం మరణించారు. ఆమె ఆత్మ శాంతి కోసం ప్రార్థనలు ఈ మసీదులో ఏర్పాటు చేశారు. ఈ ప్రార్థన కార్యక్రమం కోసం తాలిబన్లు ఇక్కడి రోడ్డును దిగ్బంధించారు. ఆ తర్వాత ఈ పేలుడు సంభవించింది. 


Updated Date - 2021-10-04T00:34:34+05:30 IST