రిమ్స్ డైరెక్టర్ తీరుకు నిరసనగా ఉద్యోగుల ధర్నా
ABN , First Publish Date - 2020-05-22T11:09:20+05:30 IST
రిమ్స్ డైరెక్టర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యోగులు, సిబ్బంది గురువారం విధులు బహిష్కరించి డైరెక్టర్ చాంబర్ ఎదుట ధర్నా
విధుల బహిష్కరణ
ఆదిలాబాద్టౌన్, మే 21: రిమ్స్ డైరెక్టర్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఉద్యోగులు, సిబ్బంది గురువారం విధులు బహిష్కరించి డైరెక్టర్ చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జనరల్ హాస్పిటల్ యూనియన్ అధ్యక్షుడు, వివిధ విభాగాల నాయకులు, పలువురు వైద్య సిబ్బంది మాట్లాడుతూ రిమ్స్ డైరెక్టర్ తరచూ చిన్న చిన్న కారణాలతో ఉద్యోగులను వేధించడం, వ్యక్తిగతంగా అటెండెన్స్ సర్టిఫికెట్ అడుగడం, కొంత కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను ఇతర విభాగాలకు మార్చి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు.
డైరెక్టర్ తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. ప్రభుత్వం వెంటనే డైరెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ధర్నా కొనసాగింది. ఇందులో వివిధ విభాగాలలో పనిచేస్తున్న వైద్యులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, ఉద్యోగులు, మెడికోలు తదితరులు పాల్గొన్నారు.