వర్షాలతో పొగాకు రైతులకు అపార నష్టం
ABN , First Publish Date - 2021-12-02T07:31:54+05:30 IST
అసాధారణంగా కురిసిన వర్షంతో పొగాకు రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘు నాథబాబు పేర్కొన్నారు.
3న బోర్డు సమావేశంలో చర్చిస్తాం
చైర్మన్ యడ్లపాటి రఘునాఽథబాబు
ఒంగోలు(రూరల్) డిసెంబరు 1 : అసాధారణంగా కురిసిన వర్షంతో పొగాకు రైతులకు తీవ్రనష్టం వాటిల్లిందని బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘు నాథబాబు పేర్కొన్నారు. స్థానిక పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్ఎస్ నేలలు అయిన నెల్లూరు జిల్లా కలిగిరి, డీసీపల్లి వేలంకేంద్రాల పరిధిలో 75శాతం దాకా తోటలు దెబ్బతిన్నాయన్నారు. టంగుటూరు, ఒంగోలు, కనిగిరి, కందుకూరు, పొదిలి వేలంకేంద్రాల పరిధిలో కూడా పొగ తోటలను పరిశీలించినట్లు తెలిపారు. పొదిలి, కనిగిరి, కందుకూరు, కలిగిరి, డీసీపల్లి కేంద్రాల పరిధిలో 19,696.20 ఎకరాల్లో పొగాకు సాగు చేయగా 6,155.70 ఎకరాల్లో పూర్తిగాను, 2,444 ఎకరాల్లో పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ఎస్బీఎస్ నేలలైన వెల్లంపల్లి, ఒంగోలు-1, 2, టంగుటూరు, కొండపిల్లో 10,194 ఎకరాల్లో సాగుచేయగా, అందులో 2,709 ఎకరాల్లో పూర్తిగా, 1,088 ఎకరాలలో పాక్షికంగాను తోటలు దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. ఈనెల 3న గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయంలో జరిగే సమావేశంలో దీనిపై చర్చిస్తామన్నారు. కార్యక్రమంలో వేలం కేంద్రాల నిర్వహణాధికారులు అట్లూరి శ్రీనివాసరావు, కోవి రామకృష్ణ, యం.రవికాంత్, ఎస్జీవోలు జె.తులసి, సునీల్ పాల్గొన్నారు