మన కంటి చూపు పరిధి ఎంత?
ABN , First Publish Date - 2022-01-12T05:30:00+05:30 IST
ఒక మనిషి ఎంత దూరం చూడగలడు? మైదానం లాంటి ప్రాంతాల్లో ఆరడుగుల ఎత్తు నుంచి చూస్తే 5 కి.మీ మేర కనిపిస్తుంది...
ఒక మనిషి ఎంత దూరం చూడగలడు? మైదానం లాంటి ప్రాంతాల్లో ఆరడుగుల ఎత్తు నుంచి చూస్తే 5 కి.మీ మేర కనిపిస్తుంది. అదే పదంతస్తుల భవనం ఎక్కితే 22 కి.మీ వరకు చూడొచ్చు. ఎంత ఎత్తుకు వెళితే అంత కంటి చూపు పరిధి పెరుగుతుంది. ఎవరెస్ట్ శిఖరంపై నుంచి చూస్తే 336 కి.మీ దూరం వరకు కనిపిస్తుంది. అయితే వాతావరణం నిర్మలంగా, స్వచ్ఛంగా ఉన్నప్పుడు, గాలిలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు విజిబిలిటీ ఎక్కువ దూరం ఉంటుంది.
భూమిపై ఎక్కువ దూరం చూసే వీలున్న ప్రదేశంగా గుర్తింపు పొందిన స్థలం ఎక్కడుందో తెలుసా? కిర్గిస్తాన్లోని డాంకోవా పర్వతం నుంచి చూస్తే చైనాలోని హిందూ టాగ్ పర్వతం కనిపిస్తుందని చెబుతారు. ఈ రెండింటి మధ్య దూరం 558 కి.మీ. అయితే ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఎవరూ చూడలేదు.
గత ఏడాది ఏప్రిల్లో పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు హిమాలయాల్లోని ధౌలాధర్ మౌంటెన్ కనిపించింది. కొన్ని దశాబ్దాల తరువాత పంజాబ్ వాసులకు 200 కి.మీ దూరంలోని ధౌలాధర్ కనిపించడం అదే మొదటిసారి. కొవిడ్ వల్ల లాక్డౌన్ విధించడంతో ఫ్యాక్టరీలన్నీ మూతపడటంతో కాలుష్యం తగ్గి విజిబిలిటీ పెరిగింది.