ఫేస్‌బుక్‌లో బైక్‌ను అమ్మకానికి పెట్టినట్టు ప్రకటన ఇచ్చి...

ABN , First Publish Date - 2021-04-02T17:58:39+05:30 IST

ఫేస్‌బుక్‌లో ద్విచక్రవాహనాన్ని అమ్మకానికి పెట్టినట్టు ప్రకటన ఇచ్చి

ఫేస్‌బుక్‌లో బైక్‌ను అమ్మకానికి పెట్టినట్టు ప్రకటన ఇచ్చి...

హైదరాబాద్‌/జీడిమెట్ల : ఫేస్‌బుక్‌లో ద్విచక్రవాహనాన్ని అమ్మకానికి పెట్టినట్టు ప్రకటన ఇచ్చిన సైబర్‌ నేరగాళ్లు ఓ వ్యక్తి నుంచి రూ.63,327 కాజేశారు. చింతల్‌లోని చెరుకుపల్లి కాలనీకి చెందిన రాజేందర్‌(36) ఫేస్‌బుక్‌లో మార్చి 22న తెలుపు రంగు హోండా యాక్టివా అమ్మకానికి ఉందని ఓ ప్రకటన చూశాడు. అందులో ఉన్న నెంబర్‌కు ఫోన్‌ చేయగా నితిన్‌ జైన్‌ అనే వ్యక్తి మాట్లాడాడు. తాను ఆర్మీ జవాన్‌నని, ప్రస్తుతం శంషాబాద్‌ విమానాశ్రయంలో పని చేస్తున్నాని, బదిలీలో భాగంగా జమ్మూ కశ్మీర్‌ వెళ్తున్నందునే తన ద్విచక్ర వాహనాన్ని అమ్ముతున్నానని నమ్మించాడు. 


అడ్వాన్స్‌గా నితిన్‌జైన్‌కు ఫోన్‌పే ద్వారా రూ.2,150 రాజేందర్‌ పంపాడు. అనంతరం 23న నితిన్‌ జైన్‌ ఫోన్‌ చేసి ద్విచక్ర వాహనం డెలివరీ చేస్తున్నామని మరో రూ.61,177 పంపమని కోరగా రాజేందర్‌ వెంటనే పంపించాడు. అనంతరం  వికాస్‌ పటేల్‌ అనే వ్యక్తి ఫోన్‌ చేసి తను లారీ డ్రైవర్‌నని వాహనం తీసుకువస్తున్నానని డబ్బులు ఆన్‌లైన్‌లో పంపించాలని కోరాడు. ఇదంతా సైబర్‌ నేరగాళ్ల పని అని అనుమానించిన రాజేందర్‌ జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తులో ఉంది.

Updated Date - 2021-04-02T17:58:39+05:30 IST