ఫేస్బుక్లో పరిచయం.. ప్రియురాలి కోసం వెళ్లగా ఊహించని షాక్!
ABN , First Publish Date - 2020-09-10T13:49:29+05:30 IST
ఫేస్బుక్ ద్వారా ప్రేమ వ్యవహారం నడిపి, ప్రియుడిని రప్పించి..
చెన్నై : ఫేస్బుక్ ద్వారా ప్రేమ వ్యవహారం నడిపి, ప్రియుడిని బన్రూటి నుంచి తిరుచ్చికి రప్పించి, అతని నుంచి మోటార్సైకిల్ను అపహరించిన ఉదంతంలో ఓ యువతితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కడలూరు జిల్లా బన్రూటికి చెందిన వినోద్కుమార్ (31)కు వివాహమై ఓ కుమార్తె ఉంది. అతనికి పేస్బుక్ ద్వారా తిరుచ్చికి చెందిన నిషా పరిచయమైంది. ఆమె తరచూ అర్ధనగ్న ఫొటోలను పోస్టు చేయడంతో పాటు, అతనితో తరుచూ సెల్ఫోన్లో మాట్లాడేది. ఈ క్రమంలో, తనను చూసేందుకు ఈనెల 5న తిరుచ్చికి రావాలని నిషా కోరడంతో, ఎప్పటినుంచో ఆమెను కలుద్దామనుకున్న వినోద్, ఉద్యోగం విషయమై తిరుచ్చి వెళుతున్నానని భార్యతో చెప్పి, తన ద్విచక్రవాహనంలో తిరుచ్చికి వెళ్లాడు. కాజామలై ప్రాంతంలో ఉన్న ఓ పాఠశాల సమీపంలో ఉన్నానని నిషా ఫోన్లో తెలపడంతో వినోద్ అక్కడకు వెళ్లాడు.
ఆ ప్రాంతంలో మాటువేసిన ఆరుగురు వ్యక్తులు వినోద్కు కత్తి చూపి బెదిరించి, అతని పర్స్, సెల్ఫోన్, ఏటీఎం కార్డ్ సహా మోటార్సైకిల్ను తీసుకొని పరారయ్యారు. ఈ ఘటనపై వినోద్ కేకే నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిషా సెల్ఫోన్ నెంబరు ఆధారంగా ఆమెతో సహా మహమ్మద్ యాసిర్, ఆషిక్లను అరెస్టు చేసి, పరారీలో ఉన్న అజీస్, సిద్ధిక్, అన్నారీల కోసం గాలిస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా వివాహమై, స్థితిమంతులుగా ఉన్న యువకులు, మధ్య వయస్కులను గురిచేసుకొని ఈ ముఠా ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.