నిర్వాసిత కాలనీల్లో వసతులు కల్పించండి
ABN , First Publish Date - 2021-01-17T04:46:50+05:30 IST
భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆర్అండ్ఆర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఆర్అండ్ఆర్ పనులు త్వరగా పూర్తి చేయాలి
భోగాపురం విమానాశ్రయం భూసేకరణపై మంత్రి బొత్స సమీక్ష
విజయనగరం (ఆంధ్రజ్యోతి) జనవరి 16 : భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి ఆర్అండ్ఆర్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్వాసితుల కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సవరించిన నోటిఫికేషన్ ఆధారంగా ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన 135 ఎకరాల భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు. వీలైనంత త్వరగా కంపెనీ యాజమాన్యానికి భూమిని అప్పగించాలని సూచించారు. గూడేపువలసలో ల్యాండ్ ఫిల్లింగ్ పనులకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి సమస్యను పరిష్కరించాలన్నారు. పోలిపల్లి మీదుగా ఎయిర్పోర్టు చేరుకు నేందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించాలని చెప్పారు. నిర్మాణ ప్రాంతంలో చెట్లును తొలగించేందుకు అవసరమైన అనుమతులు తీసుకుంటానని తెలిపారు. ఆ గ్రామంలో నెలాఖరు నాటికిపనులు చేపట్టాలని పంచాయతీరాజ్ కమిషనర్ను ఆదేశించారు.
కన్వర్జెన్సీ పనులపై...
జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులతో చేపట్టిన కన్వర్జెన్సీ పనుల పూర్తికి క్షేత్రస్థాయిలో అధికారులు బాధ్యత తీసుకోవాలని మంత్రి బొత్స సూచించారు. ఈ పనులకు గాను రూ.65 కోట్లు మేరకు బిల్లులు చెల్లించాల్సి ఉందని కలెక్టర్ హరిజవహర్లాల్ తెలిపారు. విధరకాల సమస్యలతో మొదలు కాని పనుల జాబితాను పంచాయతీ రాజ్ శాఖ ఎస్ఈ గుప్తా అందజేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. బొబ్బిలి, నెల్లిమర్ల ఎమ్మెల్యేలకు ఫోన్ చేశారు. వెంటనే పనులను కాంట్రాక్టులకు అప్పగించాలని, లేని పక్షంలో వాటిని రద్దు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ నెల 20లోగా ఆయా పనులను కాంట్రాక్టులకు అప్పగిస్తామని ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు వివరించారు. బకాయిలపై ప్రభుత్వం తో మట్లాడి విడుదల చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రి బొత్స తెలిపారు. సొమవారం నాటికి జిల్లాకు శాండ్ అధికా రులను నియమించాలని ఏపీ ఖనిజాభివృద్థి సంస్థ ఎండీ హరి నారాయణ్ను కోరారు. తెర్లాం మండలం కుసుమూరు ఇసుక రీచ్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాలని కలెక్టర్కు సూచించారు. ఏజెన్సీ ప్రాంతా ల్లో భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరుకు గిరిజన సంక్షేమ అధికా రులతో మాట్లాడుతానని స్పష్టం చేశారు. ఆరోగ్యకేంద్రాలకు రూ.17.50 లక్షలు మాత్రమే అంచనా వేశారని, వాస్తవానికి రూ.22 లక్షల వరకు ఖర్చు అవుతుందని పీఆర్ ఎస్ఈ గుప్తా వివరించారు సమావేశంలో ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, జేసీలు కిశోర్ కుమార్, జె.వెంకటరావు, డీఆర్వో గణపతిరావు, ఆర్డీవో భవానీ శంకర్, హౌసింగ్ పీడీ ఎస్.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రి అప్గ్రేడేషన్పై వినతి
చీపురుపల్లి: చీపురుపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సంబంధిత ప్రతిపాదనను మంత్రికి అందజేశారు. గతంలో ఈ ప్రతిపాదన వచ్చిందని, ఇక్కడ వంద పడకల ఆసుపత్రి అవసరం చాలా ఉందని ఆయన తెలిపారు. ఆసుపత్రి అప్ గ్రేడేషన్కు ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతం, వి.శ్రీనివాసనాయుడు తదితరులున్నారు.