మసకబారిన బ్యూరోక్రసీ ప్రతిష్ఠ

ABN , First Publish Date - 2021-09-08T05:41:24+05:30 IST

ప్రభుత్వ పాలనావ్యవస్థలో ఐఏఎస్ అధికారులు కీలక వ్యక్తులు. ఈ బాధ్యతాయుత అధికారులలో కొంత మంది ఆర్థిక ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ ప్రాపకం కోసమో కానీ అధికారంలో ఉన్న...

మసకబారిన బ్యూరోక్రసీ ప్రతిష్ఠ

ప్రభుత్వ పాలనావ్యవస్థలో ఐఏఎస్ అధికారులు కీలక వ్యక్తులు. ఈ బాధ్యతాయుత అధికారులలో కొంత మంది ఆర్థిక ప్రయోజనాల కోసమో లేదా రాజకీయ ప్రాపకం కోసమో కానీ అధికారంలో ఉన్న వారి స్వార్థపర ప్రయోజనాలను కాపాడడానికి ఎంతకైనా తెగిస్తున్నారు. చట్టాల స్ఫూర్తిని కాపాడుతూ ప్రభుత్వ పథకాలను అమలు చేయాల్సిన అధికారులు తమ రాజకీయ యజమానుల చేతుల్లో కీలుబొమ్మలు అవుతున్నారు. పర్యవసానంగా ప్రజా సంక్షేమ పథకాల అమలులో అవినీతి చోటుచేసుకుంటోంది. ఫలితంగా సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోని అధికారులు కోర్టుల హితవులు, ఆదేశాలనూ పాటించడం లేదు. పైగా కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ పదే పదే జడ్జీలతో మొట్టికాయలు వేయించుకుంటున్నారు! ఈ శోచనీయ పరిణామాలు సర్దార్ పటేల్ సంపూర్ణ విశ్వాసముంచిన ఐఏఎస్ వ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేవేనని చెప్పక తప్పదు. 


ఐఏఎస్‌ల ప్రతిష్ఠను పునరుద్ధరించడమెలా? అఖిల భారత సర్వీసుల నిబంధనలను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ నిజాయితీగా, నిష్పక్షపాతంగా ప్రభుత్వ విధానాలను ప్రజా ప్రయోజనాల పరిరక్షణకు అనువుగా అమలుపరచాలి. ఐఏఎస్ అధికారులు వృత్తి నిబద్ధతను పాటిస్తూ అనునిత్యం ప్రజలతో మమేకమవ్వాలి. ప్రజాసమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలి. అప్పుడు మాత్రమే వారి హోదాకు సార్థకత చేకూరుతుంది. ఐఏఎస్ పూర్వ వైభవంతో పరిఢవిల్లుతుంది. లేనిపక్షంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మూడో ముఖ్య విభాగమైన న్యాయవ్యవస్థ ఐఏఎస్ అధికారుల పనితీరును రాజ్యాంగ నిబంధనల కనుగుణంగా విశ్లేషించి సర్వీసు నిబంధనల్ని ఉల్లంఘించిన అధికారులపై సూమోటోగా తగు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలి. న్యాయవ్యవస్థ ఇటువంటి చొరవ చూపవలసిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. అలా జరగనప్పుడు దేశపురోగతికి మూలస్తంభంగా మారాల్సిన అత్యున్నత పాలనావ్యవస్థ ప్రతిష్ఠ మరింత దిగజారిపోవడం ఖాయం. అప్పుడు మన ప్రజాస్వామ్యం పెను ప్రమాదంలో చిక్కుకునే అవకాశముందని మరి చెప్పాలా?

నీలం సంపత్

Updated Date - 2021-09-08T05:41:24+05:30 IST