ఈటల సొంతూరులో అభిమానుల వినూత్న నిరసన

ABN , First Publish Date - 2021-05-06T18:35:55+05:30 IST

మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను బర్త్‌రఫ్ చేసిన నాటి నుంచి ఆయన

ఈటల సొంతూరులో అభిమానుల వినూత్న నిరసన

వరంగల్ అర్బన్ జిల్లా : మంత్రి పదవి నుంచి ఈటల రాజేందర్‌ను బర్త్‌రఫ్ చేసిన నాటి నుంచి ఆయన అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఆయన్ను యథావిథిగా కేబినెట్‌లోకి తీసుకోవాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈటల సొంతూరు కమలాపూరులో ఆయన అభిమానులు, కార్యకర్తలు వినూత్నంగా నిరసనకు దిగారు. గురువారం నాడు చెరువు నీళ్లలో‌కి దిగి నిరసన తెలిపారు. ఈటలపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇద్దరూ కలిసి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని అనుచరులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. ఒక్క ఈటలకే కాదు.. బడుగు బలహీన వర్గాలకు కేసీఆర్ అన్యాయం చేశారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ గడీల పాలనకు చరమగీతం  పాడే సమయం వచ్చినదని కార్యకర్తలు చెబుతున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులను పదవి నుంచి తప్పించాలని ఈటల అభిమానులు, అనుచరులు డిమాండ్ చేస్తున్నారు.


మరికొందరు మంత్రులపైనా వేటు?

కాగా.. ఈటలతోపాటు, మరికొందరు మంత్రులపై వేటు పడుతుందనే ప్రచారం చాలా రోజులుగా టీఆర్‌ఎస్‌ వర్గాల్లో జరుగుతోంది. తాజా భూ కబ్జా ఆరోపణలు, సీఎం కేసీఆర్‌ వెంటనే జోక్యం చేసుకొని విచారణకు ఆదేశించటం వెరసి ఈటలను కేబినెట్‌ నుంచి తప్పించటం కోసమే అనే వాదనలు ఆ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒక్క ఈటలపైనే కాకుండా, జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడవచ్చని అనుమానిస్తున్నారు. ఈమేరకు కీలక శాఖను నిర్వహిస్తున్న ఓ మంత్రికి ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి సంకేతాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న వ్యక్తిగత కార్యదర్శి ఈ కారణంగానే రాజీనామా చేశారని సమాచారం. నాయకత్వ మార్పు జరిగితే సహజంగానే కొత్త కేబినెట్‌ కొలువుదీరాల్సి ఉంటుందని, నాయకత్వ మార్పు ఆలస్యమైతే కేబినెట్‌లో మార్పులు, చేర్పులకు పరిమితం కావచ్చనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-05-06T18:35:55+05:30 IST