అఽధ్యయన కేంద్రాలుగా రైతు వేదికలు
ABN , First Publish Date - 2021-06-24T06:55:39+05:30 IST
రైతులకు అధ్యాయన కేంద్రాలుగా రైతువేదికలు నిలుస్తాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులకు సూచించారు.
- మంత్రి కొప్పుల ఈశ్వర్
గొల్లపల్లి, జూన్ 23 : రైతులకు అధ్యాయన కేంద్రాలుగా రైతువేదికలు నిలుస్తాయని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని శ్రీరాములపల్లె, రాఘవపట్నం, వెన్గుమట్ల గ్రామాల్లో రైతువేదికలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేళ్లుగా రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ. ఆరు వందల కోట్లు వెచ్చించి 2,601 రైతు వేదికలను నిర్మించామన్నారు. 2014 వరకు తెలంగాణ రాష్ట్రంలో రైతులు రెండు పంటలకు కలిపి 30 లక్షల ఎకరాల మేర వరి సాగు చేసేవారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండు పంటలకు కలిపి కోటి 30 లక్షల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారన్నారు. రైతులకు వినూత్నమైన పథకాలను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటు పడుతున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. రైతులు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని రైతులకు మంత్రి సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో 61 మంది లబ్ధిదారులకు రూ. 61,82,192 విలువైన కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను, 35 మంది లబ్ధిదారులకు రూ. 11,10,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. అంతకుముందు మంత్రి కొప్పుల ఈశ్వర్ విద్యుత్ శాఖ సబ్ డివిజనల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంతాసురేష్, కలెక్టర్ గుగులోతు రవి, జడ్పీటీసీ జలేందర్, ఎంపీపీ శంకరయ్య, వైస్ ఎంపీపీ సత్తయ్య, ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి, వైస్ చైర్మన్ గంగాధర్, ఆయా గ్రామాల సర్పంచ్లు రాగం శంకరయ్య, గుడ్ల లక్ష్మీరాజేశం, సింగిల్విండోల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాజ సుమన్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.