రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత

ABN , First Publish Date - 2021-12-18T19:27:51+05:30 IST

సంయుక్త కిసాన్ మోర్చా నేత గుర్నామ్ సింగ్ చడుని

రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన రైతు సంఘం నేత

చండీగఢ్ : సంయుక్త కిసాన్ మోర్చా నేత గుర్నామ్ సింగ్ చడుని శనివారం ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. రాజకీయాలను ప్రక్షాళన చేయడం, మంచివారిని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని చెప్పారు. 


సంయుక్త కిసాన్ మోర్చాలో దాదాపు 40 రైతు సంఘాలు ఉన్నాయి. వీటిలోని హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము సంయుక్త్ సంఘర్ష్ పార్టీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పారు. రాజకీయాలను ప్రక్షాళన చేయడం, మంచివారిని అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు. 


ప్రస్తుత రాజకీయ నేతలు పెట్టుబడిదారులకు అనుకూల చట్టాలు చేస్తున్నారని, పేదలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తమ పార్టీ లౌకికవాద సిద్ధాంతాలను అనుసరిస్తుందని తెలిపారు. సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము పాటుపడతామన్నారు. తాను రానున్న పంజాబ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, రాష్ట్రంలో మొత్తం 117 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయని, వీటన్నిటిలోనూ తమ పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. 


Updated Date - 2021-12-18T19:27:51+05:30 IST