నాణ్యమైన ఉత్పత్తులు అందించటమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-02-14T06:33:46+05:30 IST
రైతులకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫీడ్ ఉత్పత్తులను అందించడమే హెరిటేజ్ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. మల్లవల్లిలోని ...
హెరిటేజ్ ఎండీ నారా భువనేశ్వరి వెల్లడి
మల్లవల్లి (హనుమాన్జంక్షన్ రూరల్): రైతులకు అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో కూడిన ఫీడ్ ఉత్పత్తులను అందించడమే హెరిటేజ్ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి అన్నారు. మల్లవల్లిలోని హెరిటేజ్ న్యూట్రివెట్ ప్లాంట్లో సరికొత్త ఫీడ్ ఉత్పత్తులను భువనేశ్వరి విడుదల చేశారు. ఈ సందర్భంగా చేపల దాణా ఫ్లోటింగ్, సింకింగ్ ఉత్పత్తులతో కూడిన మొదటి లోడ్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. 27 ఏళ్ల హెరిటేజ్ సుదీర్ఘ ప్రయాణంలో నాణ్యమైన ఉత్పత్తులను అందజేస్తూ వస్తోందన్నారు. గడచిన ఐదేళ్లుగా కల్తీ లేని పశుదాణాను సంస్థ అంది స్తోందని భువనేశ్వరి వివరించారు. కల్తీ ఉత్పత్తులతో రైతులు మోసపోతుండటంతో హెరిటేజ్ వంద శాతం శాఖాహార చేపల మేత తయారీని ప్రారంభించిందని ఆమె చెప్పారు. వైద్యుల పర్యవేక్షణలో ప్రయోగాత్మకంగా రైతుల చేపల చెరువులో వాడి అన్ని రకాలైన పరీక్షలు నిర్వహించిన అనంతరమే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. శాఖాహార దాణాతో చేపలు ఆరోగ్యంగా పెరుగుతాయని, నీరు ఏ మాత్రం కలుషితంకాదని, దీని వల్ల ఎదుగుదల పెరిగి ఉత్పత్తి గణనీయంగా వస్తుందని హెరిటేజ్ న్యూట్రివెట్ డైరెక్టర్ ఎం సాంబశివరావు తెలిపారు.