రైతుకు కన్నీరు మిగిల్చిన అకాల వర్షం

ABN , First Publish Date - 2020-04-10T00:06:49+05:30 IST

జిల్లాలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం కల్గింది.

రైతుకు కన్నీరు మిగిల్చిన అకాల వర్షం

విజయనగరం: జిల్లాలో భారీ వర్షం కురిసింది. పార్వతీపురం, సాలూరు, చీపురుపల్లి నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. ఈదురుగాలుల వల్ల పంటలకు నష్టం కల్గింది. అంతేకాకుండా విద్యుత్‌ స్తంభాలు నెలకొరిగాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు ఇంటి అద్దాలు పగిలాయి. పశ్చిమ గోదావరి జీలుగుమిల్లిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వేరు శనగ, పొగాకు, మిరప, మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. భీమవరం, కొవ్వూరు, తణుకు, ఏలూరు పరిసర ప్రాంతాల్లో కూడా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షాలకు అన్నదాతకు నష్టం జరిగింది. నోటికి వచ్చిన పంటలు తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


మరోవైపు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు ఆందోళనకు గురి చేశాయి. జిల్లాలోని కైకలూరు, మచిలీపట్నం, హనుమాన్ జంక్షన్, గుడివాడతో పాటు పలు ప్రాంతాల్లోలో తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షానికి చేతికి వచ్చిన పంట నేలపాలైంది. ఆరుగాలం శ్రమించిన రైతాంగానికి చివరికి కన్నీరే మిగిలింది. అసలే కరోనా వల్ల వ్యవసాయరంగం కుదేలైంది. పంట దిగుబడులు అమ్ముకోడానికి వీల్లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2020-04-10T00:06:49+05:30 IST