రైతులకు భరోసా
ABN , First Publish Date - 2020-05-31T10:49:34+05:30 IST
: రైతులకు అన్ని విధాలా ఉపయోగపడే రైతు భరోసా కేంద్రాలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 938
924 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చొదిమెళ్ల కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం
ఏలూరుసిటీ, మే 30 : రైతులకు అన్ని విధాలా ఉపయోగపడే రైతు భరోసా కేంద్రాలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 938 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇందులో 924 కేంద్రాలను ప్రారంభించారు. ఏలూరు మండలం చొదిమెళ్లలోని రైతు భరోసా కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. ఇదే కేంద్రంలో డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని డిజిటల్ కియోస్క్ను ప్రారంభించారు. మంత్రులు చెరుకువాడ శ్రీరంగ నాథరాజు ఆచంటలో ఏఎంసీ కార్యాలయం వద్ద, తానేటి వనిత కొవ్వూరు మండలం కాపవరంలో, తాళ్లపూడి మండలం మలకపల్లి సొసైటీ కార్యాలయంలో రైతు భరోసా కేంద్రా లను ప్రారంభించారు.
ఎమ్మెల్యేలు తమ నియోజక వర్గాల్లో కేంద్రాలను ప్రారంభించారు. వ్యవసాయ డివిజన్ల వారీగా ఏలూరు డివిజన్లో 98 కేంద్రాలకు 96 కేంద్రాలు, భీమడోలు-84, చింతలపూడి- 78, తాడేపల్లిగూడెం-81, కొవ్వూరు-91, కేఆర్పురం-109, తణుకు డివిజన్లో 75 కేంద్రాలకు 73, మార్టేరు డివిజన్లో 80 కేంద్రాలకు 73, నరసాపురం డివిజన్లో 67 కేంద్రాలకు 65, పాలకొల్లు-55, భీమవరం-61, ఆకివీడు- 58 కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
రైతులకు కొండంత అండ : ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని
ఏలూరు రూరల్, మే 30 : భరోసా కేంద్రాలతో రైతులకు కొండంత అండని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. చొదిమెళ్లలో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం సీఎం జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించి రైతులనుద్దేశించి చేసిన అధికారులు, రైతులు వీక్షించారు. అనంతరం నాని మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం వ్యవసాయం దండగ అంటూ రైతులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రైతాంగానికి సంబంధించి ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ను మంత్రి నాని, జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, జేసీ వెంకటరమణా రెడ్డి, తదితరులు పరిశీలించారు. జేసీ తేజ్భరత్, ఆర్డీవో పనబాక రచన, వ్యవసాయశాఖ జేడీ గౌసియా బేగం, ఏఎంసీ చైర్మన్ మంచెం మైబాబు, ఎంపీడీవో జీఆర్ మనోజ్, తహసీల్దార్ చంద్రశేఖర్, రైతులు పాల్గొన్నారు.
అందుబాటులో అన్ని రకాల సేవలు : మంత్రి రంగనాథరాజు
వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలు రైతులకు అందుబాటులో తెచ్చేందుకే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసిందని రాష్ట్ర మంత్రి చెరుకువాడ శ్రీరంగనాఽథరాజు అన్నారు. ఆచంటలో ఏఎంసీ కార్యాలయం వద్ద రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ సుంకర ఇందిరా సీతారాం అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ పడాల సత్యనారాయణరెడ్డి వైసీపీ నాయకులు వైట్ల కిషోర్, గొడవర్తి వెంకన్నబాబు, సుంకర సీతారాం, వేదాల నాగరాజు, మట్టా ఆనంద్కుమార్, ఏడీఏ రమేశ్, ఏవో కె.రాజశేఖర్ పాల్గొన్నారు.
రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ : మంత్రి వనిత
కొవ్వూరు, మే 30 : రైతులకు రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ ఏర్పాటు చేశామని మంత్రి తానేటి వనిత అన్నారు. కాపవరంలో రైతు భరోసా కేంద్రాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల్లో దళారీ వ్యవస్థ లేకుండా రైతు ధాన్యం విక్రయించుకుని మద్దతు ధర పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లక్ష్మారెడ్డి, వ్యవసాయ ఏడీ చంద్రశేఖర్ పాల్గొన్నారు. తాళ్లపూడి మండలం మకలపల్లి సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని కూడా మంత్రి వనిత ప్రారంభించారు.
కాళ్ల మండలంలో పండుగగా ప్రారంభం
కాళ్ళ, మే 30 : మండలంలో పండుగగా రైతు భరోసా కేంద్రాలు శనివారం ప్రారంభమయ్యాయి. కాళ్లలో ఎమ్మెల్యే రామరాజు, వైసీపీ కన్వీనర్ పీవీఎల్ నరసింహరాజు ప్రారంభించారు. కోపల్లె, కాళ్ళ, కలవపూడి, కాళ్ళకూరు సొసైటీల అధ్యక్షులు వేగేశ్న రవిరాజు, సుంకర భోగేశ్వరరావు, పి.దుర్గాప్రసాదరాజు, పీవీఎల్ నరసింహరాజు ఆయా గ్రామాల్లో రైతులకు భరోసా పత్రాలు అందజేశారు. ఆకివీడు వ్యవసాయశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అనిల్కుమారి, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, ఎంపీడీవో వై.అపర్ణ, ఏవో జయవాసుకి, ఏఈవో మురళీకృష్ణ, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు.