రైతు వేదికలేనా?

ABN , First Publish Date - 2021-11-08T05:45:45+05:30 IST

ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అం దుబాటులోకి రావడంలేదు. వానాకాలంతోపాటు యాసంగిలో ఏ పంట లు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి

రైతు వేదికలేనా?

రైతులకు ఉపయోగపడని భవనాలు

నీటి సౌకర్యాన్ని కల్పించలేమంటున్న మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లు

ఎక్కడ చూసినా మూతపడి ఉంటున్న వేదికలు 

వేదికల్లోనే ఏఈవోలు పనిచేయాలని ఆదేశాలు 


నల్లగొండ, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల సేవలు ఇంకా పూర్తిస్థాయిలో అం దుబాటులోకి రావడంలేదు. వానాకాలంతోపాటు యాసంగిలో ఏ పంట లు సాగు చేయాలి, ఎలాంటి విత్తనాలు ఎంపిక చేసుకోవాలి, భూ సార పరీక్షల ద్వారా ప్రయోజనాలు, పంట తెగుళ్లు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో చేపట్టాల్సిన పంటల యాజమాన్యం తదితర అంశాలపై రైతులకు ఈ వేదికలు ఉపయోగపడుతాయని ప్రభుత్వం భావించింది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట జిల్లాలో 23 మండలాలు, యాదాద్రి జిల్లాలో 17 మండలాలు, నల్లగొం డ జిల్లాలోని 31 మండలాల్లో వీటి నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చించింది. మండలానికి నాలుగు నుంచి ఐదు చొప్పున పంచాయతీల సంఖ్యకు అనుగుణంగా రైతువేదికలు నిర్మించింది. మూడు జిల్లాల్లో 300కు పైగా రైతువేదికలు నిర్మించినా వీటితో ఉపయోగం లేకుండాపోతోంది. గ్రామాలకు దూరంగా ఉండటం, కనీస సౌకర్యాలు లేకపోవడం తో వీటికి ఆదరణ కరువైంది. ప్రభుత్వం నుంచి కనీసం ఫర్నీచర్‌కు కూ డా పూర్తిస్థాయిలో నిధులు రాలేదు. దీంతో దాతల సహకారంతో ఫర్నీచర్‌ సేకరించాల్సి వస్తోంది. జైళ్లశాఖ అధికారులు కొంతమేరకు టేబుళ్లు, ఫర్నీచర్‌ ఇవ్వగా, కుర్చీల కోసం టెండర్లు పిలవాల్సి వచ్చింది. మూడుసార్లు టెండర్లను పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. చివరికి టెండ ర్లు ఖరారు కాగా, ఒక్కో వేదికకు 100 కుర్చీల వరకు పంపిణీ చేశారు.


మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్ల వెనుకడుగు 

రైతువేదికల నిర్మాణాలు గ్రామీణ ప్రాంతాల్లో తాము చేపట్టే పైపులై న్ల ప్రాంతాల్లో ఉంటే తప్ప ఊరికి దూరంగా ఉంటే నీటి సౌకర్యం కల్పించలేమని మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లు స్పష్టం చేసినట్టు తెలిసింది. రైతు వేదికల నిర్మాణంతో పాటు ప్రహరీ, మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాల్సి ఉంది. బాత్‌రూంల నిర్మాణం పూర్తిచేసినా నీటి సౌకర్యం లేకపోవడంతో ఉపయోగంలో లేవు. నీటి సౌకర్యం కల్పించాల ని మిషన్‌ భగీరథ కాంట్రాక్టర్లకు చెప్నిఆ, కిలోమీటరు లోపు ఉంటేనే పైపులైన్లు ఏర్పాటుచేస్తామని, ఊరికి దూరంగా ఉంటే తమకు సం బం ధం లేదని, అలాంటి ప్రొవిజన్‌ కూడా లేదంటూ పేర్కొనడంతో వ్యవసాయశాఖ అధికారులకు పాలుపోవడంలేదు. సంబంధిత శాఖకు సైతం చెప్పినా ఇప్పటి వరకు నీటి సౌకర్యం కల్పించకపోవడంతో రైతువేదికల్లో ఎమ్మెల్యే, ఇతర ముఖ్యులు వస్తే మంచినీటి సౌకర్యం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామం, మండలం, జిల్లాస్థాయిలో రైతు సమన్వయ సమితి సభ్యులను నియమించినా, వారు కనీసం దీన్ని పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. రైతువేదికల్లో లోపాలు, సౌకర్యాలు లేని విషయం గురించి వారు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రైతువేదికల్లో అటెండర్‌ కూడా లేకపోవడం తో శుభ్రం చేసేవారు కరువయ్యారు. అదేవిధంగా వేదికల తాళాన్ని తా మే తీసుకొని ఎలా విఽధులు నిర్వహిస్తామని ఏఈవోలు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. ఎలాంటి సౌకర్యం అక్కడి నుంచి పనిచేయాలనడం తగదంటున్నారు. ఇక ఊరికి దూరంగా ఉన్న రైతు వేదికల్లో అసాంఘిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి.


వెలవెలబోతున్న వేదికలు

వ్యవసాయశాఖ రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు మాత్రమే రైతువేదికల్లో కార్పెట్లు వేసి సమావే లు నిర్వహించారు. ఇక సాధారణ సమయంలో కూర్చునేందుకు కుర్చీలు ఉండడంలేదు. ఇటీవల కాస్తోకూస్తో ఫర్నీచర్‌ వచ్చినా పూర్తిస్థాయిలో లేకపోవడంతో రైతు వేదికలకు నిండుదనం రావడంలేదు.ప్రభుత్వ ఆలోచన బాగానేఉన్నా ప్రభు త్వం పట్టించుకోకపోవడంతో రైతు వేదికలు నిర్వీర్యం అవుతున్నాయని రైతుసంఘాల నేతలు వాపోతున్నారు. చాలా నిర్మాణాలు ఇంకా అసంపూర్తిగా ఉండటంతో వీటిని యంత్రాంగం ఉపయోగించుకోలేకపోతోంది. ఎక్కడో ముఖ్యమైన మండల కేం ద్రం, పెద్ద గ్రామపంచాయతీల్లో తప్ప,మిగతా గ్రామీ ణ ప్రాంతాల్లో రైతు వేదికలకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. కనీసం రైతుబంధు సభ్యు లు ఆవైపు చూడటం లేదు.


ఏఈవోల విధులు ఇక్కడి నుంచే

క్షేత్రస్థాయిలో ఉండే ఏఈవోలు, ఏవోలు రైతు వేదికల్లోనే ఉండి పనిచేయాలని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఏఈవోలు, ఏవోలు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో వరి వద్దని ప్రభుత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేస్తుండ గా, గ్రామాల్లో రైతులు ఆందోళనలో ఉన్నారు. వీరికి అందుబాటులో ఉండి సమాచారం ఇవ్వాల్సిన అధికారులు అటుగా రాకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీనికితోడు హార్టికల్చర్‌, సెరీకల్చర్‌ యంత్రాంగం కూడా గ్రామాల్లోకి వెళ్లి పండ్ల తోటలు, పట్టుపురుగుల పెంపకానికి సంబంధించి సలహా లు, సూచనలు ఇవ్వాల్సి ఉంది. అయితే వారెవ్వరూ పట్టించుకోకపోవడం తో లక్షలరూపాయల వ్యయంతో నిర్మించిన వేదికలు మూతపడి కన్పిస్తున్నాయి.


ఏఈవోలు అక్కడే ఉండి పనిచేయాలి : శ్రీధర్‌రెడ్డి, జేడీఏ, నల్లగొండ 

వ్యవసాయశాఖ ఏఈవోలు రైతువేదికల నుంచి విధులు నిర్వహించాలి. ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశాం. రైతులకు అందుబాటులో ఉండేలా వేదికలు నిర్మించాం. ఒక్కో రైతువేదికకు 100 కుర్చీల కోసం ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేశాం. ఏఈవోలు, ఏవోలు రైతువేదికనే కార్యాలయంగా భావించి పనిచేయాలి. అదేవిధంగా విద్యుత్‌ బిల్లుతో పాటు నిర్వహణకు రూ.2వేల వరకు ప్రతీ రైతువేదికకు అందజేస్తున్నాం.


Updated Date - 2021-11-08T05:45:45+05:30 IST