Rail Roko: పలు రైళ్ళు సహా 100కు పైగా స్టేషన్లపై ప్రభావం
ABN , First Publish Date - 2021-10-18T20:27:50+05:30 IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నేతలు లఖింపూర్ ఖేరీ హింసాకాండ నేపథ్యంలో
న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (SKM) నేతలు లఖింపూర్ ఖేరీ హింసాకాండ నేపథ్యంలో ఇచ్చిన పిలుపుతో సోమవారం దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 'రైల్ రోకో' ఉత్తర భారతంపైనే ఎక్కువ ప్రభావం చూపించింది. సుమారు 50కి పైగా రైళ్లు నిలిచిపోగా, దాదాపు 100కు పైగా స్టేషన్లపై ఈ నిరసన ప్రభావం కనిపించింది. అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో పలువురు రైతులు సహా 8 మంది మరణాలకు కారణమైయ్యారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తొలగింపు డిమాండ్తో ఎస్కేఎం రైల్ రోకోకు పిలుపునిచ్చింది. నాటి మారణకాండలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు.
ప్రధానంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో 50 రైళ్ళను నిలిపివేయాల్సి వచ్చిందని, 100కు పైగా స్టేషన్లపై రైల్ రోకో నిరసన ప్రభావం కనిపించిందని ఉత్తరాది రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి తెలిపారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు రైల్వే పోలీస్ సిబ్బంది ఆయా స్టేషన్లు, ట్రాక్స్ వద్ద పెట్రోలింగ్ చేస్తున్నారని చెప్పారు.
పంజాబ్లో రైతు నిరసనకారులు తెల్లవారు జామున 5.15 గంటల నుంచే ఫిరోజ్పూర్ రైల్వే డివిజన్ వద్ద నాలుగు సెక్షన్లు బ్లాక్ చేసినట్టు రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. అమృత్సర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. హర్యానాలోనూ రైతులు బహదూర్గఢ్ వద్ద రైల్వే ట్రాక్పై బైఠాయించారు. సోనిపట్ రైల్వే స్టేషన్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను రంగంలోకి దింపారు. మరోవైపు, ఉత్తరప్రదశ్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఆందోళనల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘిచిన వారిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ 8 గంటల సేపు రైల్రోకోకు ఎస్కేఎం పిలుపునిచ్చింది.