రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ రైతుల ఆందోళన
ABN , First Publish Date - 2021-11-28T06:05:19+05:30 IST
రాజన్న సిరసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ శనివారం రైతులు ఆందోళన చేపట్టారు.
- ధాన్యానికి నిప్పుపెట్టి నిరసన
గంభీరావుపేట, నవంబరు 27: రాజన్న సిరసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రైస్ మిల్లర్ల తీరును నిరసిస్తూ శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యానికి నిప్పంటించి నిరసన తెలిపారు. సిద్దిపేట, కామారెడ్డి ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించారు. నెల రోజులుగా తూకం వేయకుండా తేమ పేరుతో 40 కిలోలకు గానూ రెండు కిలోల ఎక్కువ ధాన్యాన్ని తీసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక తహసీల్దార్ వచ్చి తమకు న్యాయం చేసే వరకూ కదిలేది లేదంటూ భీష్మించారు. రైతులకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వాహనాల రాకపోకలు స్తంబించిపోయాయి. తేమ పేరుతో ఎక్కువ వడ్లు తీసుకుంటున్న రైస్మిల్లర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అకాల వర్షాలతో దాన్యం తడిసిపోయి నెల రోజులుగా రోడ్లపైనే ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి తూకం వేయకుండా తేమ పేరుతో అధిక వడ్లను తీసుకుంటూ అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ అపూర్వరెడ్డిలు అక్కడికి చేరుకుని నిబంధనలను ఉల్లంఘించే రైస్మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అశోక్, ఎంపీటీసీ రాజేందర్, రైతులు పాల్గొన్నారు.