సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపులు
ABN , First Publish Date - 2021-10-24T04:51:35+05:30 IST
సబ్సిడీ విత్తనాల కోసం రైతుల ఎదురుచూపులు
తాండూరు రూరల్: ప్రస్తుత యాసంగి సీజన్ లో వేరుశనగ, వేరుశనగ పంట వేసుకునేందుకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ పై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. మండలం లోని చెంగోల్, చింతామణి పట్నం, పర్వతాపూర్, గౌతాపూర్, అంతారం, ఖాంజా పూర్, సిరిగిరిపేట్, వీరారెడ్డిపల్లి, రాంపూర్, రాంపూర్ కింది తండా, మీదితండా తదితర గ్రామాల్లో 500ఎకరాల్లో వేరుశనగ పంటను వేయనున్నారు. అదేవిధంగా బెల్కటూర్, చంద్రవంచ, మిట్టబాస్పల్లి, గుంతబాస్పల్లి, కొత్లాపూర్, జినుగుర్తి, సంకిరెడ్డిపల్లి, మల్కాపూర్, సంగెంకలాన్ తదితర గ్రామాల్లోని నల్లరేగడి నేలల్లో మరో 500 ఎకరాల్లో శనగ పంటను ప్రస్తుత రబీ సీజన్లో రైతులు విత్తుకోనున్నారు. ప్రభుత్వం కూడా వరిసాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచిస్తుండటంతో రబీలో వేరుశనగ, శనగ విత్తనాలు వేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే సబ్సిడీ విత్తనాలు అందించేందుకు విత్తనాలకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా అధికారులకు నివేదించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులను దృష్టిలో ఉంచుకుని వేరుశనగ, శనగ విత్తనాలను సబ్సిడీపై అందించడానికి చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కొంతమంది రైతులు ఇప్పటికే వేరుశనగ విత్తనాల కోసం గద్వాల, ఆలంపూర్, కర్నూలు వంటి ప్రాంతాలకు వెళ్లి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం రబీలో రైతులకు వ్యవసాయ విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు రాష్ట్ర అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.