తక్కువ ధరకు బలవంతంగా అమ్మిస్తున్నారు: ప్రియాంక

ABN , First Publish Date - 2020-10-21T22:25:43+05:30 IST

రైతుల హక్కులను హరించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖాట్ సమ్మేలన్ నిర్వహిస్తోంది. ఇది రైతు ప్రయోజనాలకు పూర్తి విరుద్దమైంది. రైతుల బాధను, దు:ఖాన్ని ఇది అర్థం చేసుకోదు. ప్రభుత్వంలో ఉన్నవారి ఆలోచనలకు ఇది ప్రతిరూపం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా రైతులను ప్రభుత్వం దోచుకుంటోంది

తక్కువ ధరకు బలవంతంగా అమ్మిస్తున్నారు: ప్రియాంక

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో రైతులను ప్రభుత్వం దోచుకుంటోందని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్డారు. రైతులకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వారి చేత పంటను అమ్మిస్తున్నారని అన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతు పాలిట శాపంగా మారనున్నాయని, కనీస మద్దతు ధర అనేది కలలో మాటేనని అన్నారు. రాష్ట్రంలోని రైతుల గురించి ప్రభుత్వం ఏమాత్రం ఆలోచించడం లేదని, రైతులకు నష్టం చేసే విధంగానే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘రైతుల హక్కులను హరించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఖాట్ సమ్మేలన్ నిర్వహిస్తోంది. ఇది రైతు ప్రయోజనాలకు పూర్తి విరుద్దమైంది. రైతుల బాధను, దు:ఖాన్ని ఇది అర్థం చేసుకోదు. ప్రభుత్వంలో ఉన్నవారి ఆలోచనలకు ఇది ప్రతిరూపం. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా రైతులను ప్రభుత్వం దోచుకుంటోంది. రైతుల పంటను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. రైతుకు ఇష్టం లేకపోయినా బలవంతంగా అమ్మేట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు క్వింటాలుకు 1,000 నుంచి 1,100 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) కంటే ఇది 800 రూపాయలు తక్కువ. కనీస మద్దతు ధర 1,868 ఉంది. నూతన వ్యవసాయ చట్టాలు పూర్తిగా అమలు కాలేదు, ఎమ్‌ఎస్‌పీ అనేది ఒకటుంది. ఇప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే రానున్న రోజుల్లో ఎమ్‌ఎస్‌పీ లేకుండా ఎలా ఉంటాయో ఊహించుకోండి’’ అని ప్రియాంక అన్నారు.

Updated Date - 2020-10-21T22:25:43+05:30 IST