హర్యానా సీఎం నివాసం వద్ద రైతుల నిరసన
ABN , First Publish Date - 2021-10-02T19:15:42+05:30 IST
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న
చండీగఢ్ : కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు శనివారం హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖత్తార్ నివాసం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వందలాది మంది రైతులు పోలీసు బారికేడ్లపై నిల్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిపై పోలీసులు వాటర్ కెనన్లను ప్రయోగించి, చెదరగొట్టారు. రాష్ట్రంలోని వివిధ మార్కెట్లు, ఎమ్మెల్యేల నివాసాల వద్ద కూడా రైతులు నిరసనలు తెలిపారు.
పంజాబ్, హర్యానాలలో వరి సేకరణను అక్టోబరు 11కు కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసిన నేపథ్యంలో రైతు నేత రాకేశ్ తికాయత్ శుక్రవారం మాట్లాడుతూ, వరి సేకరణను సకాలంలో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ సాధనకు పంజాబ్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత ఏడాది నుంచి నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఢిల్లీ-హర్యానా, ఢిల్లీ-ఉత్తర ప్రదేశ్ సరిహద్దుల్లో శిబిరాలను ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ చట్టాలను రద్దు చేసే ప్రసక్తి లేదని, రైతులతో సయోధ్య కుదుర్చుకోవడానికి సిద్ధమేనని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది.