రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-09-29T06:44:47+05:30 IST

మండలంలో గులాబ్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటను కాపాడుకునేందుకు రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ అధికారిణి జి.రాధిక సూచించారు.

రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
అమృతపురంలో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలిస్తున్న ఉద్యాన శాఖ అధికారిణి రాధిక

సబ్బవరం, సెప్టెంబరు 28 : మండలంలో గులాబ్‌ తుఫాన్‌ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటను కాపాడుకునేందుకు రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఉద్యానశాఖ అధికారిణి జి.రాధిక సూచించారు. కాయకూరలు, బొప్పాయి, అరటి వంటి పంట పొలాల్లో చేరిన నీటిని తక్షణమే కిందకు తీసేయాలని సూచించారు. వర్షం తరువాత వ్యాపించే వేరుకుళ్లు, ఆకుమచ్చ నివారణకు సీవోసి(బ్లైటాక్స్‌) 3 గ్రాములు లీటరు నీటికి చొప్పున లేదా రిడోమిల్‌ 2 గ్రాములు చొప్పున లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్లులో పోయాలని సూచించారు. రైతులు సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టినట్టయితే నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. 

నీట మునిగిన వరి పంటల పరిశీలన

గులాబ్‌ తుఫాన్‌ వల్ల నీట మునిగిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు తక్షణమే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ సరిత సూచించారు. ఆమె మంగళవారం పలు గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందుగా పొలాల్లో అధిక నీటిని కిందికి తీసేయాలని సూచించారు. ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల ఎంవోపీ పైపాటుగా వేసుకోవాలని సూచించారు. అగ్గితెగులు, పాముపొడ తెగులు ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు నివారణకు ట్రై సైక్లోజోల్‌ 0.6 గ్రాములు/ లీటరు నీటికి, పాముపొడ తెగులు నివారణకు హెక్సా కొనజోల్‌ 2ఎంఎల్‌/ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఉద్యాన పంట పొలాల్లో చేరిన నీటిని తీసేసి ఫార్ములా-(4)-5-10గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో డాక్టర్‌ లక్ష్మీతులసి, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-09-29T06:44:47+05:30 IST