కశ్మీరు ఎన్నటికీ పాక్‌లో కలవబోదు : ఫరూఖ్ అబ్దుల్లా

ABN , First Publish Date - 2021-10-14T00:37:04+05:30 IST

కశ్మీరు భారత దేశంలో అంతర్భాగమని, తనను చంపినా

కశ్మీరు ఎన్నటికీ పాక్‌లో కలవబోదు : ఫరూఖ్ అబ్దుల్లా

శ్రీనగర్ : కశ్మీరు భారత దేశంలో అంతర్భాగమని, తనను చంపినా అది అలాగే కొనసాగుతుందని, అది ఎన్నటికీ పాకిస్థాన్‌లో కలవబోదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా చెప్పారు. ఈద్గా ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ సుపిందర్ కౌర్ సంతాప సభలో బుధవారం ఆయన మాట్లాడారు. కౌర్‌ను అక్టోబరు 7న ఉగ్రవాదులు హత్య చేసిన సంగతి తెలిసిందే.


ఈ ప్రమాదకర జంతువులు (ఉగ్రవాదులు)తో మనం కలిసికట్టుగా పోరాడాలని ఫరూఖ్ అబ్దుల్లా పిలుపునిచ్చారు. కశ్మీరు ఎన్నటికీ పాకిస్థాన్ కాబోదన్నారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తాము భారత దేశంలో భాగమని, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ తాము భారత దేశంలోనే కొనసాగుతామని తెలిపారు. వాళ్ళు (ఉగ్రవాదులు) తనను కాల్చి చంపినప్పటికీ, దీనిని వాళ్ళు మార్చలేరన్నారు. 


1990వ దశకంలో ఇతరులు భయపడి కశ్మీరు లోయ నుంచి వెళ్ళిపోయారని, కేవలం సిక్కులు మాత్రమే వెళ్ళలేదని, అందుకే సిక్కులను చూసి తాను గర్విస్తానని అన్నారు. ఇప్పుడు కూడా భయపడవద్దని కోరారు. ఉగ్రవాదులపై మనమంతా కలిసికట్టుగా పోరాడాలన్నారు. భయపడకూడదని చెప్పారు. విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్‌ను చంపడం వల్ల ఇస్లాంకు ప్రయోజనం ఉండదన్నారు. ఉగ్రవాదులు దయ్యానికి ప్రయోజనం చేకూర్చుతున్నారన్నారు. ఉగ్రవాదుల పన్నాగాలు విఫలమవుతాయని చెప్పారు. మనమంతా - హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలు - కలిసికట్టుగా వారిపై పోరాడాలని తెలిపారు. 


దేశవ్యాప్తంగా విద్వేష తుపాను రేగుతోందన్నారు. ముస్లింలు, హిందువులు, సిక్కులను విభజిస్తున్నారని చెప్పారు. ఈ విభజన రాజకీయాలను ఆపాలన్నారు. లేకపోతే భారత దేశం మనుగడ కోల్పోతుందని హెచ్చరించారు. భారత దేశాన్ని కాపాడాలంటే మనమంతా కలిసికట్టుగా జీవించాలన్నారు. అప్పుడు మాత్రమే భారత దేశం ప్రగతి సాధిస్తుందన్నారు. 


Updated Date - 2021-10-14T00:37:04+05:30 IST