58 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరిని ఫేస్‌బుక్ కలిపింది

ABN , First Publish Date - 2021-10-26T02:34:08+05:30 IST

బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్(59) అనే మహిళ రెండేళ్ల వయసు ఉన్న తన తండ్రి నుంచి దూరమైంది. చిన్న వయసు, సాంకేతికత లేకపోవడం వల్ల తన తండ్రిని కలుసుకోలేకపోయింది. అయితే చాలా కాలంగా తండ్రి కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సోషల్ మీడియా సహాయం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది జూలీకి..

58 ఏళ్ల తర్వాత ఆ ఇద్దరిని ఫేస్‌బుక్ కలిపింది

న్యూఢిల్లీ: సోషల్ మీడియా వాడకం దైనందిన జీవితంలో భాగమై చాలా కాలమైంది. ఇంకా చెప్పాలంటే కొందరికి ముఖ్యమైన పనుల్లో సోషల్ మీడియా వాడకం ముందు వరుసలో ఉంటుంది. సోషల్ మీడియా వల్ల జరిగే నష్టాలు ఎలా ఉన్నా.. ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకువచ్చింది. సామాన్యుడికి గొంతుకనిచ్చింది. సరిహద్దులు దాటి పరిచయాల్ని పెంచింది. దూరాల్ని దరికి చేర్చింది.


పాత స్నేహితులు, విడిపోయిన వ్యక్తులు, తప్పిపోయిన వారు సోషల్ మీడియా ద్వారా మళ్లీ వెలుగులోకి వస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి సందర్భమే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో పునరావృతం అయింది. ఓ మహిళ తన తండ్రిని 58 ఏళ్ల తర్వాత కలుసుకుంది. చనిపోయేలోపు తండ్రిని చూడాలనుకున్న ఆమె కోరిక ఫేస్‌బుక్ ద్వారా తీరిపోయింది. ఇప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.


బ్రిటన్‌లోని లింకన్‌షైర్‌కు చెందిన జూలీ లెయిడ్(59) అనే మహిళ రెండేళ్ల వయసు ఉన్న తన తండ్రి నుంచి దూరమైంది. చిన్న వయసు, సాంకేతికత లేకపోవడం వల్ల తన తండ్రిని కలుసుకోలేకపోయింది. అయితే చాలా కాలంగా తండ్రి కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అయితే సోషల్ మీడియా సహాయం తీసుకుంటే బాగుంటుంది అనిపించింది జూలీకి. అనుకున్నదే తడవుగా తండ్రి ఫోటోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. దయచేసి తన తండ్రిని గుర్తించడంలో సాయం చేయాల్సిందిగా నెటిజనులు కోరింది. సరిగ్గా నాలుగు రోజుల్లో ఒక పోస్ట్‌లో తండ్రి అడ్రస్ వచ్చింది.


ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫేస్‌బుక్ చెప్పిన అడ్రస్‌కు వెళ్లి తండ్రిని కలుసుకుంది. ‘‘సాధారణంగా నేను అద్భుతాలను నమ్మను. కానీ ఫేస్‌బుక్‌ నాకు చేసిన మేలు చూస్తే నమ్మక తప్పడం లేదు’’ అని ఫేస్‌బుక్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

Updated Date - 2021-10-26T02:34:08+05:30 IST