ఆ నీరు తాగి, మతగ్రంథం చదివితే చాలని ఆ బాలికను...

ABN , First Publish Date - 2021-11-06T01:07:23+05:30 IST

జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లొద్దంటూ మంత్ర జలం ఇచ్చి, ఖురాన్ చదవమన్నాడో మతపెద్ద

ఆ నీరు తాగి, మతగ్రంథం చదివితే చాలని ఆ బాలికను...

కన్నూరు: జ్వరంతో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లొద్దంటూ మంత్ర జలం ఇచ్చి, ఖురాన్ చదవమన్నాడో మతపెద్ద. అతడి మాటలు నమ్మి అలానే చేసిన ఆ తల్లిదండ్రులు కుమార్తె విలవిల్లాడుతున్నా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు. ఫలితంగా ఆ చిన్నారి మరణించింది. కేరళలోని కన్నూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. 11 ఏళ్ల బాలిక తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో తండ్రి  అబ్దుల్ సత్తార్ (55) ఆమెను స్థానిక ఇమామ్ మహ్మద్ ఉవైజ్ (30) వద్దకు తీసుకెళ్లాడు. 


ఆమెను చూసిన ఇమామ్ పవిత్ర జలం పేరుతో నీళ్లు ఇచ్చి, ఖురాన్ చదవమని చెప్పాడు. అంతేకాదు, జ్వరం తగ్గిపోతుందని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఆసుపత్రికి తీసుకెళ్లొద్దని సూచించాడు. అతడి మాటలను విశ్వసించిన తండ్రి.. కళ్లముందే కుమార్తె జ్వరంతో విలవిల్లాడుతున్నా పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లకుండా బాధిత కుటుంబ సభ్యులను ఇమామ్ ఒప్పించినట్టు అతడి బంధువే పోలీసులకు తెలిపింది. 


అంతేకాదు, గతంలోనూ ఇలానే చెప్పి నలుగురి మృతికి కారణమైనట్టు పోలీసులు గుర్తించినట్టు కన్నూరు జిల్లా పోలీస్ చీఫ్ ఇళంగో ఆర్ తెలిపారు. చికిత్స తీసుకోని కారణంగా తమ కుటుంబంలో 2014, 2016, 2018లో ముగ్గురు కుటుంబ సభ్యులు మరణించినట్టు బాలిక తండ్రి సోదరుడు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక తండ్రి అబ్దుల్ సత్తార్, ఇమామ్‌లను అరెస్ట్ చేశారు. 

Updated Date - 2021-11-06T01:07:23+05:30 IST